
సాక్షి, ఢిల్లీ: తెలంగాణకు చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించి వీడియోలను తమకు అందించాలని ఆదేశించింది.
కాగా, న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసుపై ఈరోజు సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. ఈ కేసులో సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్బంగా.. హత్య కేసుకు సంబంధించి వీడియోలు సహా అన్ని పత్రాలు తమ ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం, అన్ని రికార్డులను పరిశీలించిన తర్వాత సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు ధర్మాసనం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో రికార్డులు అందజేయాలని ఆదేశించింది. అనంతరం, విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.