
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న రాయలసీమ లిఫ్ట్ స్కీం టెండర్ ప్రక్రియను అడ్డుకోవాలంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ని తెలంగాణ కోరింది. సోమవారం ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ హరికేశ్ మీనాకు లెటర్ రాశారు. ఏపీ ప్రభుత్వం మే 5న జారీ చేసిన జీవో 203పై కేఆర్ఎంబీకి అదే నెల 12న కంప్లైంట్ చేశామని, ఈ ప్రాజెక్టు టెండర్లుసహా ఎలాంటి ప్రక్రియ చేపట్టకుండా నిలుపుదల చేయాలని కోరామని గుర్తు చేశారు. సంగమేశ్వరం లిఫ్టుతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులను అడ్డుకోవాలని కోరామని తెలిపారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ముందుకే వెళ్తుందని, ఇప్పుడే నిలువరించాలని కోరింది.
తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం
కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ అనుమతి వచ్చే వరకు సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు విషయంలో ముందుకెళ్లొద్దని కేఆర్ఎంబీ మే 20న ఏపీని ఆదేశించిందని గుర్తు చేశారు. జూలై ఒకటిన ఏపీ తలపెట్టిన ప్రాజెక్టుల డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు (డీపీఆర్లు) ఇవ్వాలని కోరారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి వివరాలు ఇవ్వకుండానే ఈ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను చేపట్టిందన్నారు. ఎస్సార్బీసీ నంద్యాల సర్కిల్ ఎస్ఈ ఈనెల 15న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తే ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టుల పనులు మొదలు పెడుతుందని పేర్కొన్నారు. అదే జరిగితే కృష్ణా బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. టెండర్ల ప్రక్రియను ఏపీ సర్కారు పూర్తి చేస్తే పనులు దక్కించుకున్న వర్క్ ఏజెన్సీల నుంచి లీగల్ ఇష్యూస్ తలెత్తుతాయని ఏపీ వాదించే అవకాశముందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన టెండర్ల ప్రక్రియను ఆపుతూ వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు వచ్చే వరకూ ప్రాజెక్టులు చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment