
సాక్షి , కరీంనగర్: ఎన్నో ఏళ్ల ఎదురుచూపు తర్వాత ప్రకటించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఉమ్మడి కరీంనగర్కు మొండిచెయ్యి మిగిలింది. పీసీసీ అధ్యక్ష పీఠం రేసులో నిలిచిన నాయకులకు గానీ, పీసీసీలో కీలక పదవుల్లో వెలుగొందిన నేతలు గానీ ఢిల్లీ పెద్దలు ప్రకటించిన కమిటీలో స్థానం దక్కలేదు. ఓవైపు కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగబోతుండగా.. ఉమ్మడి జిల్లా నుంచి ఏ నాయకుడిని కూడా కమిటీలోకి తీసుకోకపోవడం కాంగ్రెస్ పార్టీ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డిని ప్రకటించిన ఏఐసీసీ.. ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను, పది మంది సీనియర్ ఉపాధ్యక్షులను, ప్రచార కమిటీని శనివారం రాత్రి ప్రకటించింది. ఏ కమిటీలోనూ ఉమ్మడి కరీంనగర్లోని నాలుగు జిల్లాలకు చెందిన సీనియ ర్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు చోటుదక్కకపోవడం గమనార్హం.