
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
శుక్రవారం పశ్చిమ-మధ్య దక్షిణ బంగాళాఖాతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం.. ఇవాళ పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరువగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. నుంచి 4.5 కి.మీ మధ్యలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలంగాణలోకి పశ్చిమ, వాయువ్య దిశ నుంచి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
దీంతో శనివారం జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపింది.
ఆదివారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. సోమవారం ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.