
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం పంటల సాగులో నల్లగొండ(నీలగిరి) జిల్లా రికార్డు సృష్టించింది. ఏకంగా 11 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను ఆ జిల్లా రైతాంగం సాగు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, గత ఏడాది కంటే దాదాపు 3 లక్షల ఎకరాలు అధికంగా ఈ సారి నల్లగొండలో భూమి సాగవడం గమనార్హం. పత్తి, వరి సాగులోనూ నల్లగొండ జిల్లానే అగ్రస్థానంలో నిలిచింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం.. శుక్రవారం నాటికి రాష్ట్రంలోనే అత్యధిక సాగు నల్లగొండ జిల్లాలో జరగ్గా, తర్వాత 7.3 లక్షల ఎకరాలతో సంగారెడ్డి జిల్లా ఉంది. గత ఏడాది ఈ రెండు జిల్లాల్లోనే సాగు 5 లక్షల ఎకరాలు దాటింది. కానీ, ఈసారి ఎనిమిది జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగయ్యాయి.
నల్లగొండ, సంగారెడ్డితో పాటు నాగర్కర్నూలు, వికారాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక, రాష్ట్రంలోనే అత్యల్పంగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో ఈ సీజన్లో 21,622 ఎకరాల్లో పం టల సాగు జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇది ఎక్కువే. ఈ జిల్లాలో గత ఏడాది కేవలం 13,096 ఎకరాల్లోనే సాగైంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలోపు ఎకరాల్లో సాగు జరిగిన జిల్లా ఇదొ క్కటే కావడం గమనార్హం. శుక్రవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.41 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరగ్గా, ఇందులో 1.31 కోట్ల ఎక రాల్లో సాధారణ, 9.68 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యాయని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment