
పేదలకు సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్రం మనదే
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్
● కేరెళ్లి గ్రామంలో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ
ధారూరు: దేశంలోనే పేదలకు సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. బుధవారం ధారూరు మండలం కేరెళ్లి గ్రామంలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం ధారూరు రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకనుంచి పేదల ఇళ్లలో కూడా సన్నబియ్యం అన్నం ఉంటుందన్నారు. గత ప్రభుత్వం ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ కొత్త రేషన్కార్డులు ఇచ్చామని తెలిపారు. జిల్లాకు కొత్తగా 22,404 కార్డులు మంజూరైనట్లు వివరించారు. 8 లక్షల 52 వేల 122 మందికి 5,582 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వరి సాగు గణనీయంగా పెరిగిందని,పంట దిగుబడిని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మనం చేరామని పేర్కొన్నారు. సీఎం సహాయ నిధి కింద 9మంది పేదలకు రూ.5.65 లక్షలు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి మోహన్బాబు, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ సాజిదాబేగం, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్, పార్టీ మండల అధ్యక్షుడు మాన్సింగ్, ఏఎంసీ చైర్మన్, వైస్ చెర్మన్లు విజయభాస్కర్రెడ్డి, అశోక్ ముదిరాజ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్లోళ్ల రాములు, కాంగ్రెస్ నాయకులు చెన్నారెడ్డి, మహ్మద్ బాబాఖాన్, రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదలందరికీ సరఫరా
అనంతగిరి: ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు స్పీకర్ ప్రసాద్కుమార్ తెలిపారు. బుధవారం వికారాబాద్ పట్టణం పాత గంజ్లోని రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సన్నబియ్యం పంపిణీ ఎంతో గొప్ప కార్యక్రమం అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్డీవో వాసుచంద్ర, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి మోహన్బాబు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, నాయకులు రమేష్ కుమార్, మథిన్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.