● పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ● ముగిసిన సైబర్ సెక్యూరిటీ బూట్ క్యాంప్
విశాఖ విద్య: యువతరం సైబర్ నేరాలను నియంత్రించే నిపుణులుగా తయారు కావాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఐదు రోజుల బూట్ క్యాంప్ బుధవారంతో ముగిసింది. సైబర్ దాడులు, సైబర్ నేరాలు అనేక దేశాలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న తీరును ఈ సందర్భంగా సీపీ వివరించారు. వ్యవస్థలోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని సైబర్ మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్న విధానాన్ని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారని, వీరు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రశ్నించడం మొదలు పెడితేనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని, యువత సైబర్ సెక్యూరిటీ రంగంలో నిష్ణాతులుగా మారడానికి అవసరమైన కోర్సులు చేయాలని సూచించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ తరగతి గదిలో నేర్చుకున్నదానికి భిన్నంగా బూట్ క్యాంపులో నైపుణ్యాలు వృద్ధి చెందుతాయని చెప్పారు. పోలీస్ శాఖ నేడు అనేక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోందన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. శశిభూషణరావు మాట్లాడుతూ సైబర్ నిపుణులను తయారు చేయడం, విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీపై శిక్షణ అందించడం, ప్రజల్లో అవగాహన కలిగించడం ఈ కార్యక్రమ లక్ష్యాలన్నారు. ఆచార్య వి. వల్లి కుమారి, కంప్యూటర్ సైన్స్ విభాగ ఆచార్యులు ఆచార్య ఎం. శశి, ఆచార్య జి. లావణ్య దేవి తదితరులు మాట్లాడిన అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కంప్యూటర్ సైన్స్ విభాగం ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.