
వినతులు పుల్ పరిష్కారం నిల్
● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు భారీగా అర్జీలు
● పరిష్కారం అంతంత మాత్రం
● ప్రతివారం పెండింగ్ అర్జీలపై కలెక్టర్ దిశానిర్దేశం
మహారాణిపేట: జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం భారీ సంఖ్యలో అర్జీలతో నిండిపోయింది. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ స్వయంగా ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి, వాటిని అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ కూడా పాల్గొన్నారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా కలెక్టర్కు విన్నవించుకున్నారు. పింఛన్లు, భూ వివాదాలు, అక్రమ కట్టడాలు, విద్య, ఇతర వ్యక్తిగత సమస్యలపై వారు అర్జీలు సమర్పించారు. సోమవారం మొత్తం 447 వినతులు రావడం సమస్యల తీవ్రతను తెలియజేస్తోంది. ఇందులో రెవెన్యూ శాఖకు 235, పోలీసు శాఖకు 28, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కు 107 అర్జీలు రాగా, ఇతర శాఖలకు సంబంధించి 77 వినతులు అందాయి.
పీజీఆర్ఎస్ పై కలెక్టర్ సమీక్ష
అంతకుముందు, కలెక్టర్ పీజీఆర్ఎస్ పై కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. అధికారులు రోజూ కనీసం ఒక గంట సమయం శాఖాపరమైన సమీక్షకు కేటాయించి, వచ్చిన అర్జీలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని సూచించారు. అధిక సంఖ్యలో అర్జీలు వస్తున్న శాఖల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న అర్జీలపై సమీక్షించి, వాటిని త్వరగా పరిష్కరించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల వివరాలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి దిశా నిర్దేశం చేశారు.
సమస్యలు విన్న అధికారులు
కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, ఇతర అధికారులు ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విన్నారు. తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. అర్జీల పరిష్కారానికి నిర్దిష్ట సమయం నిర్దేశించాలని, జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

వినతులు పుల్ పరిష్కారం నిల్