జూలో ఒంటరి జంతువులకు తోడు
చర్యలు చేపడుతున్నట్లు క్యూరేటర్ ప్రకటన
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో ఒంటరిగా ఉంటున్న జంతువులకు తోడు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు క్యూరేటర్ జి.మంగమ్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8న ‘కెమెరామెన్ జీబ్రాతో ఆస్ట్రిచ్’అనే శీర్షికన జూ పార్కులో సిబ్బంది, వైద్యుల కొరత, ఒంటరి జంతువుల వేదన, నిర్వహణ సరిగా లేకపోవడం తదితర అంశాలను ప్రస్తావిస్తూ ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన క్యూరేటర్ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. జూలో ఒంటరిగా ఉన్న చింపాంజీ, రైనో, జీబ్రా, ఆస్ట్రిచ్ తదితర వాటికి తోడు తీసుకురావడానికి పలు జూల అధికారులతో సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు. జూ పూర్తిస్థాయి వైద్యుడు వి.శ్రీనివాసరావు 4 సంవత్సరాల 11 నెలల పాటు సెలవు పెట్టి విదేశాలకు వెళ్లారని, ఆయన స్థానంలో ఇటీవల సీనియర్ వెటర్నరీ వైద్యుడు డాక్టర్ పి.భానుబాబును నియమించినట్లు చెప్పారు. అవుట్ సోర్సింగ్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు జూనియర్ వైద్యులను గత నెల 25న తొలగించామన్నారు. ఆ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. జూలో 88 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా సేవలందిస్తున్నట్లు వివరించారు.


