అగ్ని ప్రమాదం.. అప్రమత్తతే కీలకం
అల్లిపురం: రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న వేసవి తాపం అగ్ని ప్రమాదాలకు ఆజ్యం పోసేలా ఉంది. వేసవిలోనే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగి, అపార నష్టాలను మిగుల్చుతున్నాయి. అసలు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అప్రమత్తంగా ఉంటే నష్ట తీవ్రతను తగ్గించవచ్చు. దీనిపై జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరచడంతోపాటు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. జాతీయ అగ్నిమాపక దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అగ్నిమాపక అధికారి ఎస్.రమణయ్య తెలిపారు.
అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం పరిపాటి. 1944 ఏప్రిల్ 14న ముంబయిలోని విక్టోరియా డాక్యార్డ్లో జరిగిన అగ్నిప్రమాదంలో అధికారులు, సిబ్బంది, సామాన్య ప్రజలతో సహా 66 మంది మరణించగా, 87 మంది గాయపడ్డారు. ఈ అగ్నిప్రమాద ఘటనకు గుర్తుగా ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నినాదం ‘అగ్ని సురక్షిత భారతదేశానికి ఐక్యమవ్వండి’. నగరంలోని సూర్యాబాగ్, మర్రిపాలెం, పెదగంట్యాడ, ఆటోనగర్, చిట్టివలస ప్రాంతాల్లోని అగ్నిమాపక కేంద్రాల్లో వారోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు
ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం
అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు చేయాల్సిన ఫోన్ నంబర్లు
డయల్ 101, 112
విశాఖపట్నం : 0891–2563582, 2787818, 99637 28301
పెదగంట్యాడ : 0891–2517780, 2515233, 99637 28664
మర్రిపాలెం : 0891–2558470, 99637 29367
చిట్టివలస : 08933–295101, 99637 28726
ఆటోనగర్ : 0891–2515101, 99637 28664


