
జలపాతంలో ఇద్దరు యువకుల గల్లంతు
సాక్షి, పాడేరు/జగదాంబ: జీనబాడు పంచాయతీ సరియా జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంత య్యారు. పూర్ణామార్కెట్కు చెందిన ఆరుగురు యువకులు సరియా జలపాతం సందర్శనకు ఆదివారం వెళ్లారు. జలపాతంలో స్నానం కోసం దిగిన సమయంలో ప్రమాదవశాత్తు పూర్ణామార్కెట్ పండావీధికి చెందిన ఇల్లా వాసు(22), నర్సింహం జారిపడి గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం మిగిలిన నలుగురు, స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిచిపోయాయి. నలుగురు యువకులు అనంతగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరారు. గల్లంతైన ఇద్దరూ ఫిషింగ్ హార్బర్లోని చేపల దుకాణాల్లో పనిచేస్తున్నారు.
వాసు(ఫైల్)