జాతర | - | Sakshi
Sakshi News home page

జాతర

Dec 29 2025 9:18 AM | Updated on Dec 29 2025 9:18 AM

జాతర

జాతర

బీచ్‌లో

బోటు షికారు

పర్యాటక
సందర్శకులతో కిటకిటలాడుతున్న ఉమ్మడి విశాఖ నగరం, అల్లూరి జిల్లాకు పోటెత్తిన పర్యాటకులు గతేడాదితో పోలిస్తే 25 శాతం అధికంగా రాక బెంగాల్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ నుంచి అత్యధిక పర్యాటకులు జనవరి రెండో వారం వరకూ హోటల్స్‌, రిసార్టులు ఫుల్‌ గత ప్రభుత్వం చేపట్టిన టూరిజం ప్రాజెక్టులతో వెలుగుతున్న విశాఖ

సాక్షి, విశాఖపట్నం : అల్లంత దూరాన ఎగసిపడే సాగర కెరటాలు ఒకవైపు.. మంచు దుప్పటి కప్పుకుని ఆహ్వానించే మన్యం అందాలు మరొకవైపు.. ఈ ప్రకృతి రమణీయతను చూసేందుకు పర్యాటక లోకం పరుగున వస్తోంది... నీలి సముద్రం పర్యాటకుల జన సంద్రాన్ని చూసి మురిసిపోతోంది. ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే తరుణంలో పొరుగు రాష్ట్రాల నుంచి వెల్లువలా వస్తున్న సందర్శకులతో కళకళలాడుతోంది. క్రిస్మస్‌ సెలవులు.. ఇయర్‌ ఎండింగ్‌ కలిసి రావడంతో గత ప్రభుత్వ సమయంలో మొదలైన ప్రాజెక్టులు ఇప్పుడు అందుబాటులోకి రావడంతో కొత్తందాల్ని చూసేందుకు పర్యాటక లోకం విశాఖ వైపు క్యూ కట్టింది. సాగర తీరంలోని ఇసుక తిన్నెల నుంచి.. మన్యం అడవుల్లోని మంచు కొండల వరకు ఎటు చూసినా సందర్శకుల సందడే కనిపిస్తోంది. చలిని సైతం లెక్కచేయకుండా ప్రకృతి ప్రేమికులు పోటెత్తడంతో.. విశాఖ జిల్లా పర్యాటక కేంద్రాలన్నీ ‘హౌస్‌ఫుల్‌’ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.

మారిపోతున్న క్యాలెండర్‌ పేజీలు.. మరువలేని జ్ఞాపకాలను మూటగట్టుకునేందుకు పర్యాటకుల పరుగులు.. వెరసి విశాఖలో పర్యాటక జాతర మొదలైంది. క్రిస్మస్‌ సెలవులు, వారాంతం, నూతన సంవత్సర వేడుకలతో కలిసి.. ‘సిటీ ఆఫ్‌ డెస్టినీ’ పర్యాటకులతో పోటెత్తింది. సూర్యోదయపు అందాలతో మెరిసే ఆర్కే బీచ్‌ నుంచి, సాహసాలకు నిలయమైన రుషికొండ వరకు.. ప్రశాంతతను పంచే కై లాసగిరి నుంచి, ప్రకృతి ఒడిలో సేదతీర్చే తెన్నేటి పార్క్‌ వరకు ఎటు చూసినా కోలాహలమే కనిపిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగి, ఇటీవల అందుబాటులోకి వచ్చిన కై లాసగిరి ‘గ్లాస్‌ బ్రిడ్జి’ ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ వంతెనపై నడుస్తూ సాగరాన్ని వీక్షించేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అరకు, పాడేరు వంటి మన్యం ప్రాంతాల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు ఇప్పుడు పర్యాటకుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి.

కై లాసగిరి రోప్‌వే ఎక్కేందుకు కొండ దిగువన క్యూ కట్టిన సందర్శకులు

హోటళ్లు ఫుల్‌..

ఈ విపరీతమైన రద్దీ కారణంగా నగరంలోని స్టార్‌ హోటళ్లు, గెస్ట్‌ హౌస్‌లు, పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్టులు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ‘నో వెకెన్సీ’ బోర్డులు దర్శనమిస్తుండటంతో, ముందుగా రిజర్వేషన్లు చేసుకోని వారు వసతి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి జిల్లాలోని లంబసింగి, అరకు వంటి ప్రాంతాల్లో సాధారణ గదులే కాదు, చివరికి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన టెంట్లు కూడా నిండిపోయాయంటే పర్యాటకుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

25 శాతం పెరిగిన ఫుట్‌ఫాల్‌

గత ఏడాదితో పోలిస్తే ఈసారి పర్యాటకుల సంఖ్యలో సుమారు 25 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్‌ తర్వాత విశాఖ చూస్తున్న అతిపెద్ద పర్యాటక సీజన్‌ ఇదేనని అధికారులు పేర్కొంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనం తరలివస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా అనంతగిరిలోని బొర్రా గుహలను ఒక్క ఆదివారమే ఏకంగా 20 వేల మంది సందర్శించడం విశేషం. జూ పార్క్‌, కై లాసగిరి వంటి చోట్ల ప్రవేశ టికెట్ల కోసం పర్యాటకులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.ఈ సందడి జనవరి రెండో వారంలో ముగిసే సంక్రాంతి సెలవుల వరకు కొనసాగే అవకాశం ఉంది.

రుషికొండ

జాతర1
1/2

జాతర

జాతర2
2/2

జాతర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement