
నీటి తొట్టెల నిర్మాణానికి భూమిపూజ
శృంగవరపుకోట: వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు వీలుగా జిల్లా వ్యాప్తంగా 306 నీటితొట్టెలు నిర్మిస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ తెలిపారు. ప్రస్తుతం 46 నీటితొట్టెల నిర్మాణానికి రూ.15.74 లక్షలు మంజూరు చేసినట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా జామి మండలం తాండ్రంకిలో రూ.33వేల వ్యయంతో చేపట్టిన నీటితొట్టె పనులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 10,357 సేద్యపు కుంటలు పనులు చేపడతామని, జిల్లాలో మూడేళ్లలో పంట కాలువలు, ఫీడర్ చానల్స్, పిల్లకాలువలను అభివృద్ధి చేస్తామన్నారు. తాండ్రంగి–తానవరం మధ్య గోస్తనీ నదిపై వంతెన ఏర్పాటు చేయాలని, కొట్టాం–విజయనగరం బస్సును పునరుద్ధరించాలని, ఇనాం భూముల సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరారు. గ్రామంలో ఒక వ్యక్తి ధౌర్జన్యం చేస్తు న్నారని ఎస్సీ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరపాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. విజినిగిరి గ్రామంలో పలువురు పింఛన్దారుల ఇళ్లకు వెళ్లి కలెక్టర్ పింఛన్ డబ్బులు అందజేశారు. కార్యక్రమంలో సీఈఓ బి.వి.సత్యనారాయణ, మండల ప్రత్యేకాధికారి కుమారస్వామి, ఎంపీడీఓ ఎస్.అప్పలనాయుడు, తహసీల్దార్ కృష్ణతేజ, తదితరులు పాల్గొన్నారు.