డిప్యూటీ సీఎం తీరుపై నిరసన
శృంగవరపుకోట:
గిరిజన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్కు వినిపించేందుకు ఎస్.కోట మండలంలోని ధారపర్తి పంచాయతీ వాసులు సోమవారం మండుటెండలో విశాఖ– అరకు రోడ్డులో ఎదురు చూశారు. ఆయన కాన్వాయ్ ఆగకుండా వెళ్లిపోవడంతో నిరాశ చెందారు. దీనికి నిరసనగా బొడ్డవర నుంచి ఎస్.కోట వరకు మంగళవారం పాదయాత్రగా వచ్చి ఎండీఓకు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు గాడి అప్పారావు, మద్దిల రమణ, ధారపర్తి సర్పంచ్ సన్నిబాబు, మాజీ సర్పంచ్ ఎం.బుచ్చన్న, ఎర్రయ్య, అరుణ్, జోషి తదితరులు మాట్లాడుతూ గిరిజన గ్రామాల ప్రజలకు డోలీ మోతలు తప్పడం లేదన్నారు. రోడ్లు, కాలువలు, తాగునీరు, విద్య, వైద్యం వంటి సదుపాయాలు అక్కరకు రావడంలేదని వాపోయారు. గిరిజన ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించేవారే కరువయ్యారన్నారు. ఎన్నికల సమయంలో గిరిజనులపై చూపించే ప్రేమ తర్వాత నేతల్లో కరువవుతోందన్నారు. గిరిజనుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించేవారే లేరని వాపోయారు.
పాదయాత్రగా వెళ్లి ఎంపీడీఓకు వినతి


