తాగునీటి ఎద్దడి నివారణకు తొలి ప్రాధాన్యం
బిల్లుల భారం మోయలేం
● విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు జెడ్పీ నుంచి రూ.కోటి చొప్పున నిధుల కేటాయింపు
● తాగునీటి పంపింగ్కు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వెల్లడి
● పింఛన్ల తొలగింపుపై వాడీవేడిగా
సాగిన చర్చ
● సంక్షేమ పథకాల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమన్న జెడ్పీ చైర్మన్
● మంత్రి ఆరోపణలకు కౌంటర్
● సమావేశానికి డుమ్మా కొట్టిన మంత్రి, కూటమి ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలు హాజురుకాకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలు..
విద్యుత్ బిల్లుల భారం వినియోగదారులు మోయలేని విధంగా ఉన్నాయని ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్బాబు అన్నారు. నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలో ఉన్న తన ఇంట్లో రెండు ఫ్యాన్లు, రెండు లైట్లు, ఒక ఏసీ వినియోగిస్తున్నామని, నెలకు రూ.లక్ష బిల్లు ఇచ్చారని సభలో ప్రస్తావించారు. నెల్లిమర్ల మండలం సారపల్లి గ్రామంలో ఇంటింటికీ తాగునీటి కుళాయిలు మంజూరులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన సామగ్రిని రైతు భరోసా కేంద్రంలో నిరుపయోగంగా వదిలేశారని అధికారుల దృష్టికి తెచ్చారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా సమస్యలను తెలియజేశారు.
విజయనగరం:
వేసవి దృష్ట్యా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు తొలిప్రాధాన్యమివ్వాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. శివారు ప్రాంతాల ప్రజలు సైతం తాగునీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదన్నారు. దీనికోసం జిల్లా పరిషత్ తరఫున జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన జెడ్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో వేసవిలో తాగునీటి సరఫరా, పింఛన్ల తొలగింపు, విద్య, విద్యుత్, మెడికల్ అండ్ హెల్త్, ఉపాధి హమీ, హౌసింగ్ తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. జిల్లాలోని అన్నిబోర్ వెల్స్, తాగునీటి పథకాలు తనిఖీచేసి మరమ్మతులకు గురైతే వెంటనే బాగుచేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు జెడ్పీ చైర్మన్ సూచించారు. తోటపల్లి, చంపావతి, ఆండ్ర జలాశయాల పరిధిలోని బోరు బావులను ముందే రీచార్జి చేసుకునేందుకు అనుమతులు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. నీటి పంపింగ్కు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. పింఛన్ల వెరిఫికేషన్ కోసం ఏ ఆధారంలేని దివ్యాంగులు ఆస్పత్రుల్లో ఏర్పాటుచేసే శిబిరాలకు హాజరుకావడం కష్టంగా ఉంటోందని, ప్రభుత్వమే సచివాలయ సిబ్బందిని తోడు పంపాలని కోరారు. వితంతువులందరికీ పింఛన్లు మంజూరు చేయాలన్నారు. సీహెచ్సీల్లో వైద్యుల పోస్టులు భర్తీచేసి మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలన్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో పింఛన్ల తొలగింపుపై జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మధ్య వాడీవేడిగా చర్చసాగింది. అర్హుల పింఛన్లు తొలగిస్తున్నారంటూ పలువురు సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ గత ప్రభుత్వ హయాంలో 10 లక్షల పింఛన్లు తొలగించారంటూ వాఖ్యానించారు. దీనిపై జెడ్పీ చైర్మన్ తీవ్రంగా స్పందించారు. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వ పాలన సమయానికి ఇచ్చే పింఛన్లు ఎన్ని..? కూటమి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లు ఎన్ని అన్నది స్పష్టంగా లెక్కలు ఉన్నాయని, మరి ఎందుకు పింఛన్లు తగ్గాయంటూ ప్రశ్నించారు. సర్వేల పేరుతో పింఛన్ల తొలగిస్తున్నారని ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారని, దీనికి స్పష్టమైన సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వంపై బురదజల్లడం సరికాదన్నారు. గత ప్రభుత్వం ప్రతీ ఆరునెలలకోసారి అర్హతే ప్రామాణికంగా పింఛన్లు, సంక్షేమ పథకాలు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. సభ సాక్షిగా ప్రజలకు మంచి జరగాలన్నదే అభిమతంగా సమస్యలపై చర్చిస్తున్నామన్నారు. కూటమి నేతలు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హమీలు ఎందుకు అమలుచేయడంలేదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు...? ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి..? 50 సంవత్సరాలకే పింఛన్ మంజూరు..? మహిళలకు ఉచితబస్సు వంటి సూపర్ సిక్స్ హమీలు ఎందుకు అమలు చేయలేదన్నారు. అధికారంలో ఉండి పనులు చేయకుండా గత ప్రభుత్వంపై నెట్టడం సరికాదన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద విజయనగరం జిల్లాలో 2,75,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా.. టీడీపీ చేసిన తప్పిదాల కారణంగా ఆయకట్టు తగ్గిపోయే పరిస్థితి నెలకొందన్నారు. 2024 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా జెడ్పీకి నిధులకు మంజూరు చేయలేదన్నారు. మంత్రి కొండపల్లి స్పందిస్తూ 15వ ఆర్థిక సంఘం పద్దు కింద రూ.9 కోట్ల నిధులు మంజూరు చేశామని సమాధానమివ్వగా... అవి కేంద్ర ప్రభుత్వం నిధులని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన జనరల్ ఫండ్స్ నిధులు మంజూరు చేయలేదన్నారు. ఎంపీటీసీలు, ఎంపీపీలకు ఇవ్వాల్సిన గౌరవం వేతనం విడుదల చేయకపోవడం విచారకరమన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సాగిన పాలనపై చర్చకు సిద్ధమైతే మేము సిద్ధమన్నారు. చర్చ మధ్య లో తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్విని జోక్యం చేసుకుని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కారణంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా చాలడం లేదంటూ వాఖ్యానించడంతో సభలో ఉన్న సభ్యులు ఆమైపె ప్రశ్నల వర్షం కరిపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హమీల్లో ఎన్ని అమలు చేశారో స్పష్టమైన సమాధానం చెప్పాలని సభ్యులంతా ప్రశ్నించడంతో ఆమె ఉక్కిరిబిక్కిరయ్యారు. చివరకు కలెక్టర్ అంబేడ్కర్ జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించడంతో సభలో మిగిలిన అంశాలపై చర్చ సాగింది. సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు, జెడ్పీ సీఈఓ బెహరా వెంకట సత్యనారాయణ, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.
11 మంది ఎమ్మెల్యేలకు ఇద్దరే హాజరు
జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశానికి మంత్రి సంధ్యారాణితో పాటు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలపై చర్చించాల్సిన సభకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 11 ఎమ్మెల్యేలు ఉండగా.. గజపతినగరం ఎమ్మెల్యే, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు, ఓ మంత్రి సభకు గైర్హాజరయ్యారు. ఇదే విషయమై మంత్రి శ్రీనివాస్ను విలేకరుల ప్రశ్నించగా.. తక్కువ సమయంలో సమాచారం అందించడంలో వారంతా హాజరుకాలేకపోయారని సమాధానం ఇచ్చారు.
పింఛన్ల తొలగింపుపై రచ్చ
ఆలోచన చేస్తున్నాం
పింఛన్లపై చర్చలో గతేడాది నవంబర్ కంటే ముందు భర్తలు కోల్పోయిన మహిళలకు వితంతు పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అసలైన దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేయాలన్న ఉద్దేశంతోనే తనిఖీలు చేస్తున్నట్టు చెప్పారు. కార్లు, బైక్లు నడిపేవారికి పింఛన్లు ఎలా మంజూరు చేస్తామన్నారు. ఉపాధిహామీ వేతన బకాయిలు జనవరి 14 నుంచి చెల్లించాల్సి ఉందని, ఈ నెల 13, 14 తేదీల్లో చెల్లిస్తామని సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఉపాధిహామీ పనులు పంచాయతీ తీర్మానాలతో సంబంధంలేకుండా, నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయని సభ్యులు ప్రస్తావించగా, కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ స్పందిస్తూ గ్రామసభల్లో తీర్మానం చేసిన పనులనే చేపడుతున్నట్టు చెప్పారు. నాణ్యతలోపించే పనులు తన దృష్టికి తీసుకొస్తే తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ తాగునీటి సరఫరాకు అవసరమైన మెటీరియల్ను ఎంపీ నిధులతో సమకూర్చుతామని చెప్పారు.
బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన మాట్లాడుతూ బొబ్బిలి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. విద్యుత్ లో ఓల్టేజీ సమస్య వేధిస్తోందన్నారు. బొబ్బిలి పీహెచ్సీలో ముగ్గురు వైద్యులకు ఒకే సారి బదిలీ చేశారని, కొత్తవారు వచ్చే వరకు వీరిని కొనసాగేలా చూడాలని అధికారులను కోరారు.
సభలో చర్చించిన
కొన్ని అంశాలు..
విద్యుత్ బిల్లుల భారం తగ్గించాలని, సర్దుబాటు చార్జీలను ప్రభుత్వమే భరించాలని సభ్యులు కోరారు.
ఉపాధి హమీ పథకం మేట్ల అక్రమ నియామకాలను అరికట్టాలని, మండల తీర్మానాలు లేకుండా వెండర్స్తో పనులు చేయించడం తగదని పలువురు సభ్యులు సభ దృష్టికి తెచ్చారు.
కురుపాం, గరుగుబిల్లి మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆయా మండలాల సభ్యులు కోరారు. జీఎల్పురంలో పలు గ్రామాల్లో తాగు నీటి సమస్యను పరిష్కారించాలని ఇటీవల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
సొంతింటి నిర్మాణం కోసం సచివాలయానికి వెళ్తే అక్కడి ఇంజినీరింగ్ అసిస్టెంట్ టీడీపీ నేతల నుంచి అనుమతి ఉండాలంటూ దరఖాస్తును చెత్త బుట్టలో పడేశారని దత్తిరాజేరు జెడ్పీటీసీ సభ్యుడు సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ అంబేడ్కర్ స్పందిస్తూ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
తాగునీటి ఎద్దడి నివారణకు తొలి ప్రాధాన్యం
తాగునీటి ఎద్దడి నివారణకు తొలి ప్రాధాన్యం
తాగునీటి ఎద్దడి నివారణకు తొలి ప్రాధాన్యం
తాగునీటి ఎద్దడి నివారణకు తొలి ప్రాధాన్యం
తాగునీటి ఎద్దడి నివారణకు తొలి ప్రాధాన్యం


