కొత్తకోట రూరల్: రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తూ అధికారుల సలహాలు, సూచనలతో వరి సాగు చేపడితే పెట్టుబడి తగ్గడంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) యాంత్రీకరణ శాస్త్రవేత్త అడుసూరి మస్తానయ్య సూచించారు. శనివారం మండలంలోని రాయినిపేటలో ‘సీడ్ డ్రిల్’తో వరి సాగు విధానం, పొడి దుక్కుల్లో వరి విత్తే పద్ధతిపై రైతులకు అవగాహన కల్పించారు. సీడ్ డ్రిల్ పద్ధతిలో ఎకరాకు 12 కిలోల వరి విత్తనం సరిపోతుందన్నారు. మూస పద్ధతిలో ఎక్కువ ఖర్చు అవుతుందని.. ఈ పద్ధతిలో నారు పెంచకుండా, కరిగెట చేయకుండా, నాటడం లేకుండా పొడి విత్తనాలను నేరుగా పొలంలో విత్తుకోవచ్చని వివరించారు. కలుపు సమస్యను మందుల ద్వారా నివారించుకోవచ్చన్నారు. ఈ పద్ధతిలో సాళ్లల్లో విత్తనానికి విత్తనానికి మధ్య దూరం కూడా పాటించబడుతుందని చెప్పారు. గాలి, వెలుతురు ప్రసరించడంతో చీడపీడల నుంచి పంటను కాపాడుకోవచ్చన్నారు. పంట కూడా వారం పదిరోజుల ముందుగానే కోతకు వస్తుందని, దిగుబడి కూడా గణనీయంగా పెరిగి అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ రవీందర్రెడ్డి, రైతులు, కూలీలు పాల్గొన్నారు.
యాంత్రీకరణ శాస్త్రవేత్త అడుసూరి మస్తానయ్య
Comments
Please login to add a commentAdd a comment