ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు | - | Sakshi

ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు

Apr 3 2025 1:14 AM | Updated on Apr 3 2025 1:59 PM

వనపర్తి విద్యావిభాగం/ఖిల్లాఘనపురం: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 36 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. బుధవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు 6,853 మంది విద్యార్థులకు గాను 6,840 మంది హాజరు కాగా.. 15మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకోగా.. సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

● ఖిల్లాఘనపురం బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని డీఈఓ అబ్దుల్‌ ఘని తనిఖీ చేశారు. జిల్లాలో ప్రశాంత వాతవరణంలో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మండలంలో మొత్తం 443 మంది విద్యార్థులకు గాను 441 మంది చివరి పరీక్షకు హాజరైనట్లు ఎంఈఓ జయశంకర్‌ తెలిపారు.

సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం

కొత్తకోట రూరల్‌: రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయడం చారిత్రాత్మకమైనదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 1, 9, 20 రేషన్‌ దుకాణాలతో పాటు పెద్దమందడి మండల కేంద్రంలోని 1వ రేషన్‌ షాపులో అదనపు కలెక్టర్‌ జి.వెంకటేశ్వర్లతో కలిసి ఆయన సన్నబియ్యం పంపణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడు శ్రీమంతులు తినే సన్నరకం బియ్యాన్ని తినాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై రూ. 5,481 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 5,173 కోట్ల భారం పడుతుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1,59,353 రేషన్‌ కార్డులు ఉండగా.. 5,22,367 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు.

 జిల్లాలోని 324 చౌకధర దుకాణాల్లో 3,309 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులు బాగా లేకపోయినప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే అర్హులందరికీ కొత్త రేషన్‌ కార్డులు జారీ చేస్తామన్నారు. ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, తహశీల్దార్‌ సరస్వతి పాల్గొన్నారు.

ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం

వనపర్తి: నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని.. రాజీవ్‌ యువవికాసం పథకం దరఖాస్తులను ఆప్‌లైన్‌లోనూ స్వీకరించాలని అదనపు కలెక్టర్‌ యాదయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో రాజీవ్‌ యువవికాసం పథకానికి సంబంధించి జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇతర విధివిధానాల గురించి చర్చించారు. 

అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత, ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించిందన్నారు. ఈ పథకానికి దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. జిల్లాలోని యువత నేరుగా ఎంపీడీఓ, మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేలా కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 

గడువులోగా అందిన దరఖాస్తులను మండలస్థాయిలో పరిశీలించి.. 20వ తేదీలోగా జిల్లాస్థాయి కమిటీకి పంపాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత 21 నుంచి 31వ తేదీ వరకు కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం జూన్‌ 2 నుంచి 9వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా అర్హులకు మంజూరు పత్రాలను అందించనున్నట్లు తెలిపారు. డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా ఉద్యానశాఖ అధికా రి అక్బర్‌, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అబ్జాలుద్దీన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మల్లికార్జున్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి ఉన్నారు.

ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు 1
1/2

ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు

సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం2
2/2

సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement