దామెర: సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని విశ్రాంత వ్యవసాయ సీనియర్ శాస్త్రవేత్త జలపతిరావు అన్నారు. గో–ఆధారిత వ్యవసాయంపై దుర్గంపేట్ సమీపాన ఉన్న ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యవసాయ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఆదివారం రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పాత వ్యవసాయ పద్ధతుల ద్వారా సేంద్రియ వ్యవసాయం పెరగాలని, గో ఆధారిత వ్యవసాయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. భూసార పరీక్షలు చేయించి రిపోర్టు ఆధారంగా పంటలు వేసుకోవాల ని సూచించారు. భూమి విషతుల్యమై పంటలు పండకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, రసాయన ఎరువులకు ప్రభుత్వాలు సబ్సి డీ ఇవ్వడం మానుకోవాలన్నారు. అనంతరం ఉత్త మ రైతులను గుర్తించి ఉగాది పురస్కారాలు అందజేశారు. జెడ్పీ మాజీ చైర్మన్ సమ్మారావు, కిసాన్ సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నం రాజిరెడ్డి, వ్యవసాయ అధికారి విజయభాస్కర్, రైతులు పాల్గొన్నారు.