ఆత్మకూరు/దామెర: ప్రజల్లో పోలీసుల గౌరవం పెంచేందుకు పోలీసు అధికారులు నిజాయితీగా పనిచేయాలని, న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. ఆత్మకూరు, దామెర పోలీస్ స్టేషన్లను సీపీ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పరిసర ప్రాంతాలు పరిశీలించిన అనంతరం సిబ్బంది వివరాలు, పలు రికార్డులు పరిశీలించారు. నమోదవుతున్న కేసులు, రౌడీషీటర్ల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా ఉంటూ వెంటనే సమస్యలు పరిష్కరించాలని అన్నారు. రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. సైబర్నేరాలు, మాదకద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేయాలని సూచించారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వరంగల్–భూపాలపట్నం జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని, నేరాల నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్, ఏఎస్పీ మనన్భట్, పరకాల ఏసీపీ సతీశ్బాబు, ఆత్మకూరు, పరకాల రూరల్ సీఐలు సంతోష్, రంజిత్రావు, దామెర ఎస్సై కొంక అశోక్, సిబ్బంది ఉన్నారు.
చెక్పోస్ట్ తనిఖీ..
ఇసుక అక్రమ రవాణా కట్టడి చేసేందుకు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కటాక్షపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్ట్ను పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సందర్శించారు. చెక్పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వివరాలు, వాహనాల తనిఖీ తీరును సీపీ అడిగి తెలుసుకున్నారు.
పోలీసులు నిజాయితీగా పనిచేయాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్
ఆత్మకూరు, దామెర పోలీస్ స్టేషన్ల తనిఖీ