
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి
కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: జిల్లాలో ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెండు, మూడు రోజుల్లో ప్రారంభించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించాలని, గన్నీ సంచుల కొరత, ధాన్యం తరలింపులో ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొమరయ్య, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మేనేజర్ మహేందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి..
గ్రామీణులకు మరింత మెరుగైన వైద్య సేవలందించాలని హనుమకొండ కలెక్టర్ వైద్యులకు సూచించారు. జిల్లాలో ఇటీవల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ)లుగా నియమితులైన 11 మందికి కలెక్టరేట్లో నియామక పత్రాలు అందించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. టీబీ, నాన్ కమ్యునికేబుల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య కార్యక్రమాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ స్థాయిలో అందిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన సేవలను ఎంఎల్హెచ్పీలు సమర్థంగా, అంకితభావంతో అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయ్కుమార్, ప్రోగ్రాం అధికారులు కె.లలితాదేవి, డాక్టర్ హిమబిందు, డాక్టర్ ఇఫ్తాకర్ అహ్మద్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి రాజేశ్కుమార్, మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, డీపీఓ రుక్ముద్దీన్, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
సుందరీమణుల పర్యటనకు
ఏర్పాట్లు సిద్ధం చేయాలి..
ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే వివిధ దేశాల సుందరీమణులు మే 14న వరంగల్కు రానున్నారని.. అన్ని ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రెవెన్యూ, పర్యాటక, ఇతర శాఖల అధికారులతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ సెక్రటరీ స్మితా సబర్వాల్ మార్గనిర్దేశం మేరకు ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను అధికారులకు వెల్లడించారు. కాళోజీ కళాక్షేత్రం సందర్శించనున్న వారికి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా మహిళలు బతుకమ్మలతో ఘన స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమం ప్రపంచ స్థాయిలో వరంగల్ పర్యాటక, వాణిజ్య అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం సందర్శన అనంతరం వారు ములుగులోని రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీటీఓ శ్రీనివాస్కుమార్, జిల్లా పర్యాటకశాఖ అధికారి శివాజీ, నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేశ్, ‘కుడా’ పీఓ అజిత్రెడ్డి, పాల్గొన్నారు.