మోటార్‌ సైకిల్‌కు నిప్పు పెట్టిన దొంగలు | - | Sakshi
Sakshi News home page

మోటార్‌ సైకిల్‌కు నిప్పు పెట్టిన దొంగలు

Mar 22 2025 12:53 AM | Updated on Mar 22 2025 1:06 AM

కామవరపుకోట: ఒక మోటార్‌ సైకిల్‌ నిప్పంటించి కాల్చి వేసి, వేరొక మోటార్‌ సైకిల్‌ దొంగిలించిన ఘటన ఈస్ట్‌ యడవెల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని కొణతం స్వామి ఇంటి ఆవరణలో గురువారం రాత్రి పెట్టిన హోండా షైన్‌ మోటార్‌ సైకిల్‌ శుక్రవారం ఉదయానికి పూర్తిగా కాలిపోయి కనిపించింది. అదే రోజు రాత్రి ముక్కు కృపారాజు ఇంటి ఆవరణలో ఉన్న హోండా షైన్‌ మోటార్‌ సైకిల్‌ దొంగలు దొంగలించిపోయారు. ఈ ఘటనపై బాధితులు తడికలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కాలువలో స్నానానికి దిగి విద్యార్థి గల్లంతు

పెంటపాడు: మండలంలోని పరిమెళ్ల చినకాపవరం కాలువలో డ్యాం వద్ద స్నానానికి దిగి ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. పెంటపాడు ఎస్సై స్వామి తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్న 8 మంది విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం పరిమెళ్ల గ్రామ శివారు చినకాపవరం కాలువలోకి స్నానాలు చేసేందుకు వెళ్లారు. కొంతసేపు వారంతా కాలువలో ఆటలాడారు. ఉన్నట్టుండి ఒక విద్యార్థి అయిన గుంటూరు జిల్లా మండేపూడి గ్రామానికి చెందిన పల్లెపోగు వరప్రసాద్‌ (20) ప్రమాదవశాత్తూ కాలువ లోతు తెలియక కొట్టుకుని పోయాడు. వెంటనే సహచర విద్యార్థులు, స్థానికులు పోలీసులకు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. కాగా రెస్క్యూ సిబ్బంది సాయంతో పరిసర ప్రాంతమంతా రాత్రి పొద్దుపోయే వరకు వెతికినా ప్రసాద్‌ ఆచూకీ లభించలేదు. ఫైర్‌ అధికారి జీవీ సుబ్బారావు, ఎస్సై స్వామి సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పరిశీలించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి

తాడేపల్లిగూడెం (టీఓసీ): ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు మార్చి నెలాఖరులోగా ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఏపీపీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు, అమరావతి జేఏసీ సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు హెచ్చరించారు. యూనియన్‌ పశ్చిమగోదావరి జిల్లా రీజనల్‌ కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం స్థానిక సూర్యవంశీ ఎన్‌క్లేవ్‌లో రీజినల్‌ అధ్యక్షుడు ఎన్‌వీ ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆరేళ్లు గడిచినా ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. మూడు వేల మంది సిబ్బంది ప్రమోషన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. పదోన్నతులతో పాటు 11వ పీఆర్‌సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరండర్‌ లీవ్‌ సొమ్ములను చెల్లించాలని కోరారు. తొలుత పట్టణంలో ఈయూ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈయూ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.డీ ప్రసాద్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.సోమసుందర్‌,సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల బీమారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement