
కోడి పందేల స్థావరాలపై దాడులు
ద్వారకాతిరుమల: మండలంలోని ఐఎస్.జగన్నాథపురం, మలసానికుంట గ్రామాల్లో కోడి పందేల స్థావరాలపై ఆదివారం పోలీసులు దాడి చేసి 19 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 49,200 నగదు, 4 కోడి పుంజులు, 5 కోడి కత్తులు, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో 8 మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.15,800 నగదు, కోడి పుంజు, రెండు కోడి కత్తులు, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. మలసానికుంటలో 11 మందిని అరెస్ట్ చేసి, రూ.33,400 నగదు, 3 కోడి పుంజులు, 3 కోడి కత్తులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
ముదినేపల్లి మండలంలో..
ముదినేపల్లి రూరల్: మండలంలోని రెండు గ్రామాల్లో కోడిపందేలు ఆడుతున్న 9 మందిని ఎస్సై వీరభద్రరావు ఆదివారం అరెస్టు చేశారు. గురజ పంటకాలువ దగ్గర కోడిపందేలు ఆడుతున్నారన్న సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేసి నలుగురిని అదుపులోనికి తీసుకుని వారి నుంచి రూ.3050 నగదు రెండు కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నారు. కొరగుంటపాలెంలో కోడిపందేలు ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.4,200 నగదు కోడిపుంజు స్వాధీనం చేసుకున్నారు.
మృతదేహంతో బంధువుల ఆందోళన
కొట్టి చంపేశారు: కుటుంబసభ్యులు
తణుకు అర్బన్: మద్యం దుకాణ ఆవరణలో ఈ నెల 29న వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనలో మృతుడు శ్రీనివాసరావు మృతదేహంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆదివారం వైన్ షాపు వద్ద ఆందోళన నిర్వహించారు. శ్రీనివాసరావును కొట్టి చంపేశారని, కాళ్లు, చేతులు వెనక్కి మడిచేసి దారుణంగా హింసించినట్లుగా ఒంటిపై ఉన్న గాయాలే చెబుతున్నాయని మృతుడి భార్య లక్ష్మి, కుమార్తెలు ఆరోపించారు. గత మూడు రోజులుగా వైన్ షాపు ఆవరణలోని సీసీ కెమేరాలు పనిచేయడంలేదని షాపు యజమానులు అంటున్నారని, ఇప్పుడు ఎందుకు పనిచేస్తున్నాయని వారు నిలదీశారు. విషయం తెలుసుకున్న బహుజన సంఘ నాయకుడు చింతపల్లి గురుప్రసాద్ ఆందోళనకారులకు మద్దతు పలికారు. తక్షణమే బ్రాంది షాపు లైసెన్స్ను రద్దుచేయాలని, బాధిత కుటుంసభ్యులకు న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని అన్నారు. తణుకు రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్సైలు చంద్రశేఖర్, జానా సతీష్లు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ ఘటనపై రూరల్ ఎస్సై చంద్రశేఖర్ను వివరణ కోరగా పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ తెలియదని, కేసు దర్యాప్తులో ఉందని చెప్పారు.