
రోడ్డే.. రైతు బజార్
చౌటుప్పల్లో రైతు బజార్ లేక అవస్థలు
దళారులను ఆశ్రయించక
తప్పడం లేదు
నేను ప్రైవేట్ జాబ్ వదిలేసి గత పది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. నాకున్న భూమిలో కొంత మేరకు కూరగాయలు సాగు చేస్తున్నా. పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చౌటుప్పల్లోని వ్యాపారులకు కమీషన్ ఏజెంట్లకు అమ్ముతున్నాను. మండలంలో రైతు బజార్ లేకపోవడం వల్ల వ్యాపారులకు అమ్ముతున్నాను. రైతులకు ఉపయోగ పడే విధంగా మండలంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలి.
– పిసాటి ఉపేందర్రెడ్డి, రైతు, ఆరెగూడెం
హైదరాబాద్ మార్కెట్కు
తీసుకుపోతున్న
నేను సుమారు 20 ఏళ్ల నుంచి కూరగాయలు సాగు చేస్తున్న. పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఓ వైపు ధర లేకపోవడం, మరోవైపు అమ్ముకోవడానికి దగ్గర్లో రైతు బజార్ లేకపోవడంతో నానా యాతన అవుతుంది. పండించిన కూరగాయలను అమ్ముకోవడానికి హైదరాబాద్లోని మార్కెట్ కు తీసుకువెళ్తున్నా. కొన్నిసార్లు సూర్యాపేట మార్కెట్కు తీసుకెళ్లి అమ్ముతున్నాను.
– బోరెం నర్సిరెడ్డి, రైతు, తూర్పుగూడెం
ఫ దళారుల చేతిలో దగా పడుతున్న కూరగాయల రైతులు
ఫ అనువైన స్థలంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని డిమాండ్
చౌటుప్పల్ రూరల్: క్షేత్ర స్థాయిలో కూరగాయలు పండిస్తున్న రైతులు ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. రైతులు పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. వాణిజ్య కేంద్రంగా ఉన్న చౌటుప్పల్ మండలంలో పలు గ్రామాల్లో కూరగాయల సాగు అధికంగా ఉంది. ముఖ్యంగా మండలంలోని తూర్పుగూడెం, ఎస్.లింగోటం, ఆరెగూడెం, కాట్రేవు, చిన్నకొండూర్, దామెర, చింతలగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, ధర్మాజీగూడెం గ్రామాల్లో రైతులు పెద్దఎత్తున కూరగాయల పంటలను సాగు చే స్తున్నారు. పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి చౌటుప్పల్ మండల కేంద్రంలోని వ్యాపారుల వద్దకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ నగర్, సూర్యాపేట మార్కెట్కు తరలిస్తున్నారు. ఎకరంలో సాగు చేసిన రైతులు చౌటుప్పల్లోని కమీషన్ ఏజెంట్ వ్యాపారుల వద్దకు కూరగాయలను తీసుకుపోయి వారు చెప్పిన రేటుకు అమ్ముకుని వస్తున్నారు. ఎకరం పైన కూరగాయలు సాగు చేసిన రైతులు ఆటోల్లో హైదరాబాద్, సూర్యాపేట ప్రాంతాల్లోని మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముకుంటూ దళారుల చేతిలో దగాకు గురవుతున్నారు.
రైతు బజార్ ఏర్పాటు చేస్తే రైతులకు,
వినియోగదారులకు మేలు
చౌటుప్పల్ మండలంలో కూరగాయలతో పాటు ఆకుకూరలను కూడా అధికంగా సాగు చేస్తున్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులకు అనువైన స్థలం లేకపోవడంతో పాటు రైతు బజార్ లేకపోవడంతో కమీషన్ ఏజెంట్లను, దళారులను ఆశ్రయించాల్సిన వస్తుందని రైతులు వాపోతున్నారు. రైతులు తమ పంటలను నేరుగా వారే అమ్ముకుంటే దళారులు ఇచ్చే ధర కంటే ఎక్కువగా అమ్ముకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూరగాయలు కోనుగోలు చేసే ప్రజలకు సైతం వ్యాపారుల వద్ద కోన్న ధర కంటే తక్కువకు లభించడంతో పాటు తాజా కూరగాయలు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణమే చౌటుప్పల్ మండల కేంద్రంలో రైతులకు అనువైన ప్రదేశంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

రోడ్డే.. రైతు బజార్

రోడ్డే.. రైతు బజార్

రోడ్డే.. రైతు బజార్