పసుపు-కుంకుమ పేరిట రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సభ్యుల ఖాతాల్లో రూ.3 వేల చొప్పున పదివేల కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పొదుపు, రుణాల రూపేణా చేతికందిన సొమ్ము గురించి ఇంట్లో మగాళ్లకు తెలియనివ్వవద్దని, తెలిస్తే తాగుడుకు వాడేస్తారని, ఇవ్వకపోతే హింసిస్తారని హెచ్చరించారు. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలో 15 సూత్రాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. వాటిని పాటిస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వచ్చే సంక్రాంతికి కూడా కానుకలు అందజేస్తామని, ఆ సరుకులతో పిండివంటలు చేసుకొని ఆనందించాలని చెప్పారు. రాష్ట్ర జనాభా తగ్గిపోతోందని, పిల్లలను కని రాష్ట్ర జనాభాను పెంచాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని 46,211 డ్వాక్రా సంఘాలకు రూ.285.30 కోట్ల ఆస్తులను సీఎం పంపిణీ చేశారు.