సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా రోడ్డు పక్కన ఉన్న బిల్బోర్డు అమాంతం ఊడిపడి వాహనదారులపై పడింది. ఈ ప్రమాదంలో వేర్వేరు బైకులపై వస్తున్న ఇద్దరు వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా ఇది హైదరాబాద్లో జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భయంకర ఘటన మెహదీపట్నంలో జరిగిందంటూ ఓ ఫేస్బుక్ యూజర్ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో అనేకమంది ఈ వీడియోను ఇతరులకు షేర్ చేస్తున్నారు.
అయితే ఈ వార్తలో నిజం లేదు. ఈ ఘటన పాకిస్తాన్లోని కరాచీలో జరిగిందని తేలింది. ఆగస్టు 6న కరాచీలోని మెట్రోపోల్ హోటల్కు సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని 'ద ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్' వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఆ నగరంలోని బిల్బోర్డులను తొలగించాలని కరాచీ కమిషనర్ కార్యాలయం అధికారులను ఆదేశించింది. మరోవైపు తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సైతం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న ఈ వీడియో హైదరాబాద్లో జరగలేదని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు.
వాస్తవం: ఈ భయానక ప్రమాదం హైదరాబాద్లో చోటు చేసుకోలేదు.