Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Naidu govt another Scam with medical colleges in AP1
పప్పు బెల్లాల్లా మెడికల్‌ కాలేజీలు 'అమ్మబడును'!

ఈ ఫొటోలో కనిపిస్తున్నది వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని ప్రభుత్వ నూతన వైద్య కళాశాల. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 47.58 ఎకరాల్లో రూ.500 కోట్లతో కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణం చేపట్టింది. వైఎస్సార్‌సీపీ హయాంలోనే దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి. 2024–25 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభించేందుకు గత ప్రభుత్వంలోనే ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేశారు. తొలి ఏడాది 50 ఎంబీబీఎస్‌ సీట్లతో ప్రారంభించేందుకు ఎన్‌ఎంసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా చంద్రబాబు సర్కారు దీన్ని ప్రైవేట్‌ పరం చేసేందుకు కుట్రపూరితంగా లేఖ రాసి సీట్లను రద్దు చేయించింది. ఇప్పుడు ఈ మెడికల్‌ కాలేజీని ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కారుచౌకగా ఎకరం ఏడాదికి రూ.100 చొప్పున లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక్కడ ఎకరం మార్కెట్‌ రేటు రూ.2 కోట్లు పలుకుతోంది. ఈ లెక్కన సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిని ఏడాదికి కేవలం రూ.4,700 చొప్పున ప్రభుత్వం లీజుకు ఇచ్చేస్తోంది. అంతేకాకుండా ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో ఎంబీబీఎస్‌ తరగతులు నిర్వహించేందుకు సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన కాలేజీని ప్రైవేట్‌కు కట్టబెట్టి ఏకంగా 66 ఏళ్ల పాటు హక్కులు కల్పించబోతోంది. ఇదే తరహాలో గత ప్రభుత్వంలో దాదాపుగా పూర్తయిన 10 మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేస్తోంది. సాక్షి, అమరావతి: ప్రభుత్వానికి విలువైన సంపద సమకూరుస్తూ రూ.వందల కోట్లతో దాదాపుగా పూర్తి చేసిన మెడికల్‌ కాలేజీలను ఏ ప్రభుత్వమైనా సద్వినియోగం చేసుకుంటుంది! ప్రజలకు ఆరోగ్యం, విద్యార్థులకు వైద్య సీట్లు చేరువలో అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకుంటుంది! కానీ కేవలం రూ.ఐదు వేలు.. పది వేల కోసం ఓ మెడికల్‌ కాలేజీని ఎవరైనా ఇచ్చేస్తారా? అన్ని వసతులతో సిద్ధమైన ప్రభుత్వ వైద్య కళాశాలను భవనాలతో సహా అప్పగించేస్తారా? అవి కూడా ఒకటి రెండు కాదు.. ఏకంగా పది కాలేజీలు!! చంద్రబాబు సర్కారు మాత్రం సరిగ్గా ఇదే చేస్తోంది. అన్ని వసతులతో రూపుదిద్దుకున్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ఎకరం రూ.వందకే ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. మరికొద్దిగా వ్యయం చేస్తే ఇవన్నీ అందుబాటులోకి వచ్చి పేదలకు ఉచితంగా సూపర్‌ స్పెషాల్టీ వైద్యం.. మన విద్యార్థులకు మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే టీడీపీ పెద్దలు ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యతను గాలికి వదిలేసి పప్పు బెల్లాల మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాలలను తన సన్నిహితులకు కట్టబెడుతున్నారు. ఈ స్కామ్‌కు ఆమోద ముద్ర వేయించుకునేందుకు ఓ కన్సల్టెన్సీని తెరపైకి తెచ్చి కథ నడిపిస్తున్నారు. తనకు ఆది నుంచి అలవాటైన రీతిలో సీఎం చంద్రబాబు తెర చాటున పావులు కదుపుతున్నారు. ఓ వైద్య కళాశాలను సాధించాలంటే ప్రభుత్వం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలాంటిది ఈ ప్రభుత్వం ఒక్క కాలేజీ కూడా తీసుకురాకపోగా ఇప్పటికే మంజూరై దాదాపుగా పూరై్తన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కి అప్పగించి చేతులు దులుపుకోవడం వల్ల వైద్య సేవల కోసం అటు పేదలు.. వైద్య సీట్లు కోల్పోయి ఇటు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పేదలకు వైద్యం, పిల్లలకు చదువులు సమకూర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఈ రెండింటినీ నెరవేరుస్తూ గత ప్రభుత్వం ఒకేసారి భారీగా మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టింది. అయితే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టుదలతో సాకారమైన ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌ విద్యా సంస్థలకు కట్టబెట్టే యత్నాలను టీడీపీ కూటమి సర్కారు ముమ్మరం చేసింది. ప్రభుత్వ కళాశాలలు, బోధనాస్పత్రులను ప్రైవేట్‌కు ఏకంగా 66 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడంతో పాటు వైద్య సేవలకు పేదల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేసే హక్కు కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌కు ధారాదత్తం చేయడంపై కేపీఎంజీ సంస్థ వైద్య శాఖకు ఫీజిబిలిటీ నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. వైద్య శాఖ అధికారుల కమిటీ దీనికి ఆమోదం తెలిపాక టెండర్లు పిలవనున్నారు.ఒకేసారి 17 కాలేజీలకు వైఎస్‌ జగన్‌ శ్రీకారం..రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచితంగా సూపర్‌ స్పెషాలిటీ వైద్యం, మన విద్యార్థుల వైద్య విద్య అవకాశాలను పెంపొందించేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏకంగా 17 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటిలో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్‌ కాలేజీల్లో 2023–24లో, గతేడాది పాడేరు వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. పిడుగురాళ్ల వైద్య కళాశాలకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఇవి కాకుండా మిగిలిన 10 కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో అప్పగించనుంది. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను, రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం కళాశాలలను పీపీపీలో ఇవ్వాలని కూటమి సర్కారు నిర్ణయించింది. తొలి దశలో నాలుగు కళాశాలలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిర్వహణ బాధ్యతలు దక్కించుకున్న వారికి ఎకరం భూమిని కేవలం రూ.100కే ప్రభుత్వం లీజుకు ఇవ్వనుంది. ఒక్కో వైద్య కళాశాల 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది. ఈ లెక్కన రూ.వందల కోట్ల విలువ చేసే భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు గతేడాది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికే వీటిలో తొలి ఏడాది ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభించేలా చాలా వరకూ పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం మిగిలిన అరకొర పనులూ పూర్తి చేసి ప్రైవేట్‌ వ్యక్తులే 66 ఏళ్ల పాటు నిర్వహించుకునేలా హక్కులు కల్పించనుంది. తొలుత 33 ఏళ్లు తర్వాత 33 ఏళ్ల పాటుఆటో రెన్యువల్‌ అయ్యేలా నిబంధనలు రూపొందించినట్టు సమాచారం.సేవలకు డబ్బులు వసూలు..ప్రైవేట్‌ వ్యక్తుల అజమాయిషీలో నడిచే వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందవు. అదే ఈ కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తే ఓపీ, ఐపీ, రోగ నిర్ధారణ, అవయవాల మార్పిడి లాంటి పెద్ద శస్త్ర చికిత్సలు సైతం పేదలకు పూర్తి ఉచితంగా అందేవి. వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు అప్పగిస్తున్న నేపథ్యంలో ఇన్‌–పేషెంట్, రోగ నిర్ధారణ, మందు బిళ్లల కోసం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకునే వీలు కల్పించారు. సగం మెడిసిన్‌ సీట్లను కూడా ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో మాదిరిగా అమ్ముకునేందుకు అవకాశం ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మెడిసిన్‌ సీట్ల విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ హామీలిచి్చంది. అధికారం చేపట్టిన వంద రోజుల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల జీవోలను రద్దు చేస్తామని నాడు నారా లోకేశ్‌ నమ్మబలికారు. గద్దెనెక్కాక సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాను ఎత్తివేయకపోగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏకంగా ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు.తెల్ల కోటు కల ఛిద్రం..!ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెడుతూ మన విద్యార్థుల తెల్లకోటు కలను చంద్రబాబు చిదిమేశారు. 2024–25 విద్యా సంవత్సరంలో మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందుల వైద్య కళాశాలలు ప్రారంభం కాకుండా అడ్డుçపడ్డారు. 50 సీట్లతో పులివెందుల కాలేజీలో తరగతులు ప్రారంభించేందుకు ఎన్‌ఎంసీ అనుమతులు ఇవ్వగా టీడీపీ కూటమి సర్కారు కుట్రపూరితంగా లేఖలు రాసి అనుమతులు రద్దు చేయించింది. అయితే గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల పాడేరులో 50 సీట్లతో తరగతులు ప్రారంభం అయ్యాయి. వాస్తవానికి గతేడాది 750 ఎంబీబీఎస్‌ సీట్లు సమకూరాల్సి ఉండగా చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలతో ఏకంగా 700 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం మెడికల్‌ కాలేజీలు ప్రారంభమై వీటి ద్వారా 1,050 సీట్లు సమకూరాల్సి ఉంది. అయితే ఒక్క కళాశాలకు కూడా ప్రభుత్వం దరఖాస్తు చేసిన దాఖలాలు లేవు. దీంతో 2024–25లో 700 సీట్లు, 2025–26లో 1,750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోనున్నారు.

YS Jagan Serious on Chandrababu Naidu Govt over Tenali Police Incident2
చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి?: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు బహిరంగంగానే థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తున్నదో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు సర్కారు తీరును తీవ్రస్థాయిలో ఎండగడుతూ మంగళవారం ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు.తెనాలిలో యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ.. ‘‘చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. పోలీసులకు అంతులేని అధికారాన్ని కల్పించి... దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల హక్కులను గౌరవించకుండా ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’ అమలు చేస్తోంది’’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. యువకులపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి ‘తెనాలిలో దళిత, మైనారిటీ యువకులు చేబ్రోలు జాన్‌ విక్టర్, దోమా రాకేశ్, షేక్‌ బాబూ­లాల్‌ అలియాస్‌ కరీముల్లాపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి చేశారు. బాధితులను నడి రోడ్డుపై కూర్చోబెట్టి, అరికాళ్ల మీద లాఠీలతో దారుణంగా కొట్టారు. ఒక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌.. బాధితుల కాళ్లను తొక్కిపట్టగా, మరొక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ లాఠీలతో దాడి చేశారు. మిగిలినవారు ఈ దాడిని వీడియో తీశారు. లాఠీలు విరిగిపోతే నవ్వుతూ కొత్తవి అందజేశారు. వీడియో వైరల్‌ అయ్యాకే విషయం వెలుగులోకి... ఘోర ఘటనపై మాట్లాడడానికి కూడా ధైర్యం లేక స్థానికులు భయంతో నెలపాటు మౌనంగా ఉన్నారు. వీడియో వైరల్‌ అయ్యాకే దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఎంతటి భయానక వాతావరణం నెలకొందో ఈ ఉదంతం చెబుతోంది. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఇలాంటి ఎన్నో దారుణ, అమానవీయ దాడులు జరుగుతున్నాయి. భయంతో ప్రజలు నోరు విప్పలేని పరిస్థితులు ఉండటం వల్ల వెలుగులోకి రావడం లేదు. పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం, అక్రమ కేసులు పెట్టడం, అన్యాయంగా అరెస్టులు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ఇలాంటి పరిస్థితులు ప్రజల్లో ప్రభుత్వం పట్ల, చట్టబద్ధ పాలన పట్ల విశ్వాసం సన్నగిల్లేటట్లు చేస్తున్నాయి. రాజ్యాంగం కేవలం కాగితంగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది మానవ హక్కులను కాలరాసే చర్య... తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల దాడి మానవ హక్కులను కాలరాసే చర్య. రాజ్యాంగ విలువల మీద నేరుగా దాడి చేయడమే. పోలీసులు న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలను సమరి్పంచాలే తప్ప... వాళ్లే న్యాయమూర్తులుగా వ్యవహరించి, శిక్షించే పని చేపట్టకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలను కొట్టడం, హింసించడానికి చోటే లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈ దాడులకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

USA Govt Pauses new student visa interviews3
ట్రంప్‌ మరో సంచలనం.. విద్యార్థి వీసా ఇంటర్వూలకు బ్రేక్‌

వాషింగ్టన్‌: అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించి విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపేయాలని డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో అమెరికా వ్యతిరేక, హమాస్‌ అనుకూల భావజాలం పెరిగిపోతోందన్న ట్రంప్‌ ప్రభుత్వం ఆందోళనల నడుమ విదేశాంగ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇక, ఇప్పటికే షెడ్యూలింగ్‌ అయిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను కొనసాగించవచ్చని, ఈరోజు నుంచి కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూలింగ్‌ చేయొద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలను మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు అత్యయిక ఉత్తర్వుపై మార్కో రూబియో సంతకం చేశారు. విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందించిన వివరాలతో వారి సోషల్‌మీడియా అకౌంట్లలో అమెరికా వ్యతిరేక భావజాలం తాలూకు వివరాలను అమెరికా ఇమిగ్రేషన్‌ విభాగ నిపుణులు విశ్లేషించచనున్నారు. ఎఫ్, ఎం, జే కేటగిరీ దరఖాస్తుల సోషల్‌మీడియా ఖాతాల పాత పోస్ట్‌లు, వ్యాఖ్యానాలను అధికారులు నిశితంగా గమనించనున్నారు.అమెరికా వ్యతిరేక ధోరణి ఎవరి సోషల్‌మీడియా ప్రొఫైల్, హిస్టరీలో కనిపిస్తే వారిని ఇంటర్వ్యూలదాకా రానివ్వకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విదేశీ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో స్టూడెంట్‌ వీసాల జారీ ప్రక్రియ మరింత ఆలస్యంకానుంది. అంతర్జాతీయ విద్యార్థుల చేరిక, వారి ట్యూషన్‌ ఫీజులపై ఆధారపడిన పలు అమెరికా విశ్వవిద్యాలయాలకు ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. విదేశీ విద్యార్థుల అమెరికా కల సైతం కాస్తంత చెదిరిపోయే ప్రమాదం పొంచి ఉంది. క్లాసులు డుమ్మా కొడితే వీసా రద్దు.. ఇదిలా ఉండగా.. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరగతులకు డుమ్మా కొట్టినా లేక కోర్సులు మధ్యలో వదిలేసినా వీసా రద్దు కావడం ఖాయం. భవిష్యత్తులో వీసా కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా ఉండదు. విద్యాసంస్థకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తరగతులకు గైర్హాజరు కావడం లేదా కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేస్తే విద్యా వీసా రద్దవుతుందని ఇండియాలోని అమెరికా ఎంబసీ తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళవారం సోషల్‌ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. వీసా నిబంధనలకు ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. అమెరికాలో చదువుకుంటున్న కాలంలో సమస్యలేవీ రాకుండా ఉండాలంటే స్టూడెంట్‌ స్టేటస్‌ కోల్పోకుండా జాగ్రత్తపడాలని పేర్కొంది. అమెరికాలో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతిఏటా వీరి సంఖ్య పెరుగుతోంది.

India To Develop Its Own 5th Gen Fighter Aircraft AMCA4
వచ్చేస్తోంది ఐదో తరం ఫైటర్‌

న్యూఢిల్లీ: మారుతున్న యుద్ధతంత్రాలకు అనుగుణంగా అధునాతన ఐదోతరం యుద్ధవిమానాన్ని రూపొందించే బృహత్తర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అడ్వాన్స్‌డ్‌ మీడి యా కంబాక్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఏఎంసీఏ–అమ్కా)గా పిలిచే నవతరం యుద్ధవిమానం మోడల్‌ తయారీకి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఆమోదముద్ర వేశారు. ఏఎంసీఏ ప్రాజెక్ట్‌లో భాగంగా గగనతలంలో మెరుపువేగంతో దూసుకుపోతూ శత్రు రాడార్లు, నిఘా వ్యవస్థలను ఏమారుస్తూ భీకర స్థాయిలో దాడి చేయగల మధ్యస్థాయి బరువైన ఐదో తరం యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయనున్నారు.కొత్త ప్రాజెక్ట్‌ దేశీయ రక్షణ సామర్థ్యాలను మరింత పెంచడంతోపాటు స్థానిక వైమానిక తయారీ రంగ పరిశ్రమ పురోభివృద్ధికి ఇది బాటలు వేయనుందని రక్షణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)కు చెందిన ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏడీఏ) రక్షణ రంగ సంస్థల భాగస్వామ్యంతో ఏఎంసీఏ మోడల్‌ను అభివృద్ధి చేయనుంది. ప్రైవేట్‌ సంస్థలకూ ప్రాజెక్టులో భాగస్వామ్యం దక్కుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి.‘‘ఈ ప్రాజెక్ట్‌ను స్వతంత్ర సంస్థలాగా లేదంటే జాయింట్‌ వెంచర్‌లాగా లేదంటే కన్సార్షియం మాదిరి నెలకొల్పి ప్రారంభించనున్నాం. ఈ కొత్త సంస్థను భారతీయ సంస్థగానే నమోదు చేస్తాం. పూర్తిగా భారతీయ చట్టాలు, నియమనిబంధనలకు లోబడే ఈ సంస్థ పనిచేయనుంది. ఏఎంసీఏ ప్రోటోటైప్‌ దేశీయ రక్షణరంగ సత్తాను చాటేలా ఉంటుంది. రక్షణరంగంలో స్వావలంబన, ఆత్మనిర్భరత సాధనలో ఇది మైలురాయిగా నిలవనుంది’’అని రక్షణ శాఖ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌ను రూ.15,000 కోట్ల ఆరంభ వ్యయంతో మొదలు పెట్టనున్నారు.దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాయుసేన, నావికాదళం డిమాండ్లకు తగ్గట్లు ఏఎంసీఏ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చుతోంది. తేలికపాటి యుద్ధవిమానమైన తేజస్‌ తర్వాత మధ్యశ్రేణి బరువైన అడ్వాన్స్‌డ్‌ మీడియా కంబాక్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ త యారీ దిశగా భారత్‌ ముందడుగు వేయడం విశేషం. దీన్ని 2035కల్లా తయారు చేయాలని డీఆర్‌డీవో భావిస్తుంది. భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ గతేడాది ఈ ప్రాజెక్ట్‌కు అంగీకారం తెలిపింది. పదేళ్లలోపు తయారు చేస్తామని డీఆర్‌డీఓ పేర్కొంది. భిన్న రకాల బాంబులు అమ్కాలో వేర్వేరు రకాల క్షిపణులు, మందుగుండును అమర్చవచ్చు. ⇒ గైడెడ్‌ మిస్సైళ్లతోపాటు నాలుగు దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించవచ్చు. ⇒ 1,500 కేజీల బరువైన బాంబులను సునాయాసంగా జారవిడవగలదు. ⇒ ఇది అత్యల్పస్థాయిలో విద్యుదయస్కాంత స్వ భావాన్ని ప్రదర్శిస్తుంది. దాంతో శత్రు రాడార్లు దీని జాడను కనిపెట్టడం చాలా కష్టం.మూడు దేశాల వద్దే ప్రస్తుతం మూడు దేశాల వద్ద మాత్రమే ఐదో తరం యుద్ధవిమానాలున్నాయి. ⇒ అమెరికా: ఎఫ్‌–22 రాప్టర్, ఎఫ్‌–35ఏ లైట్నింగ్‌– ఐఐ ⇒ చైనా: చెంగ్డూ జె–20 మైటీ డ్రాగన్, జె–35 ⇒ రష్యా: సుఖోయ్‌ 57ఇ సైలెంట్‌ కిల్లర్‌ కొత్త తరహా సెన్సార్‌ వ్యవస్థ, అంతర్గత ఆయుధ వ్యవస్థ, కమ్యూనికేషన్, నావిగేషన్, సూపర్‌ క్రూయిజ్‌ సామర్థ్యం ఇలా ఎన్నో విశిష్టతల సమాహారంగా అమ్కా ఫైటర్‌ జెట్‌ రూపుదిద్దుకోనుంది. ఇందులోని విశేషాలు అన్నీ ఇన్నీ కావు... ⇒ అమ్కా మొత్తం బరువు 25 టన్నులు. ఇందులో జంట ఇంజిన్లు ఉంటాయి. సుదూరాలకు ప్రయాణించగలిగేలా 6.5 టన్నుల ఇంధనాన్ని విమానంలో నింపొచ్చు. ⇒ కొత్త యుద్ధవ్యూహాలకు తగ్గట్లు, శత్రు రాడార్లకు చిక్కకుండా, నిశ్శబ్దంగా దూసుకెళ్లేలా దీనిని డిజైన్‌ చేస్తారు. ఇది ఏకంగా 55,000 అడుగుల ఎత్తులో ఎగరగలదు. ⇒ కృత్రిమ మేధ సాయంతో దీనిని పైలట్‌ లేకుండానే భూమి మీద నుంచే నియంత్రించవచ్చు. ⇒ ఉపగ్రహాల నుంచి అందే రియల్‌టైమ్‌ డేటా ను విశ్లేషించుకుంటూ కొత్తరకం నెట్‌ సెంట్రిక్‌ వార్‌ఫేర్‌ సిస్టమ్‌తో ఇది పనిచేస్తుంది. ⇒ ఇది అన్ని రకాల వాతావరణాల్లో, ప్రతికూల పరిస్థితుల్లోనూ నిరి్నరోధంగా దూసుకెళ్లగలదు. ⇒ శత్రు గగనతలంలోకి వెళ్లగానే ఎల్రక్టానిక్, ఆప్టికల్, ఇన్‌ఫ్రారెడ్‌ వ్యవస్థల సాయంతో వారి రాడార్లను పేల్చేసే ‘సీడ్‌’అనే ప్రత్యేక వ్య వస్థ ఈ విమానం సొంతం. అలా శత్రువుల క్షిపణి ప్రయోగ వ్యవస్థ నిర్విర్యమవుతుంది. మన యుద్ధవిమానాల పని సులువవుతుంది. ⇒ అమ్కా వేగంగా యాంటీ–రేడియేషన్‌ క్షిపణులను ప్రయోగించగలదు. ⇒ దీనిలో వాడే ఇంజన్‌ను విదేశీ ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాను్యఫ్యాక్చరర్‌ (ఓఈఎం)లతో సంయుక్తంగా తయారు చేయనున్నారు.ఏమిటీ ఐదో తరం? ⇒ 1940–50 దశకంలో తయారైన వాటిని తొలి తరం యుద్ధవిమానాలుగా పేర్కొంటారు. వీటిల్లో రాడార్‌లు ఉండవు. కేవలం మెషీన్‌ గన్‌ బిగించి ఉంటుంది. వేగమూ తక్కువే. ⇒ 1950–60 కాలంలో తయారైనవి రెండో తరానికి చెందినవి. ప్రాథమిక స్థాయి రాడార్‌ వ్యవస్థ వీటిల్లో ఉండేది. సూపర్‌సోనిక్‌ వేగంతో దూసుకెళ్లేవి. మిగ్‌–21, మిరాజ్‌–3 ఈ రకానివే. ⇒ 1970–80ల్లో తయారైనవి మూడో తరానికి చెందినవి. ఇవి శత్రు విమానాలను గాల్లోనే పేల్చేయగలవు. ఎఫ్‌–4, మిగ్‌–23, జాగ్వార్‌ ఈ కోవకు వస్తాయి. ⇒ 1980–90 కాలంలో తయారైనవి 3.5 తరానికి చెందినవి. వీటిల్లో డిజిటల్‌ వ్యవస్థలు వచ్చేశాయి. ఆకాశంలో 40 కి.మీ. దూరంలోని విమానాలను కూడా పేల్చేసే శక్తిసామర్థ్యాలు వీటి సొంతం. ఎఫ్‌–5ఈ టైగర్‌2, మిగ్‌–21 బిసాన్‌ ఈ రకానివే. ⇒ 1990 తర్వాత నాలుగో తరం యుద్ధవిమానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడున్నవన్నీ 4, 4.5 తరాలకు చెందినవే.

Rasi Phalalu: Daily Horoscope On 28-05-2025 In Telugu5
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు.. వ్యాపారాలు లాభిస్తాయి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి: శు.పాడ్యమి ఉ.6.43 వరకు, తదుపరి విదియ తె.4.34 వరకు (తెల్లవారితే గురువారం), నక్షత్రం: మృగశిర తె.3.15 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి ఆరుద్ర, వర్జ్యం: ఉ.9.49 నుండి 11.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.31 నుండి 12.22 వరకు, అమృత ఘడియలు: రా.7.01 నుండి 8.32 వరకు.సూర్యోదయం : 5.29సూర్యాస్తమయం : 6.25రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం.. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.వృషభం... కుటుంబసమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.మిథునం.... కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.కర్కాటకం... చిన్ననాటి మిత్రులతో సఖ్యత. బంధువులను కలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.సింహం..... శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహన, వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహం.కన్య.... శ్రమ మరింత పెరుగుతుంది. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.తుల.... కుటుంబంలో చికాకులు. ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.వృశ్చికం... ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.ధనుస్సు... నూతన వ్యక్తుల పరిచయాలు. విద్య, ఉద్యోగావకాశాలు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త పనులకు శ్రీకారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.మకరం..... మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. పనుల్లో ప్రతిబంధకాలు. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.కుంభం....... రాబడికి మించి ఖర్చులు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.మీనం.... నూతన ఒప్పందాలు. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. విద్యార్థులకు అనుకూల సందేశం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

Central govt employees Major pension rule change PSUs6
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌.. కొత్త రూల్‌తో బెనిఫిట్స్‌ జీరో

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూ)కు సంబంధించిన ఉద్యోగుల పెన్షన్‌ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఎవరైనా ఉద్యోగంలో ఉన్నప్పుడు డిస్మిస్‌ అయినా, మధ్యలో తొలగింపునకు గురైనా అతడికి రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు అందవు. అయితే, సదరు ఉద్యోగి డిస్మిస్‌ లేదా తొలగింపును పరిపాలనా శాఖ పునఃసమీక్షిస్తుంది. ఈ మేరకు సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌(పెన్షన్‌) రూల్స్‌–2021లో మార్పులు చేసి, సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌(పెన్షన్‌) అమెండ్‌మెంట్‌ రూల్స్‌–2025 తీసుకొచ్చారు.ఇక, ఈ కొత్త నిబంధనలను ఈ నెల 22న నోటిఫై చేశారు. సర్వీసులో ఉన్నప్పుడు మధ్యలో దు్రష్పవర్తన కారణంగా తొలగింపునకు గురైతే పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలు కోల్పోవాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి అవకాశం లేదు. మధ్యలో డిస్మిస్‌ అయినా సరే రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు యథావిధిగా అందేవి. 2003 డిసెంబర్‌ 31 కంటే ముందు నియమితులైన కేంద ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మేరకు సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌(పెన్షన్‌) రూల్స్‌–2021 వర్తిస్తాయి. రైల్వే ఉద్యోగులకు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి సర్వీసులకు మినహాయింపు ఉంటుంది.

Mahanadu organized by Telugu Desam Party in Kadapa7
అవే గొప్పలు.. అదే విద్వేషం

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా చేసిందేమీ లేకపోవడంతో సీఎం చంద్ర­బాబు.. ప్రగల్భాలు, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై విషం కక్కడానికే సమయమంతా వెచ్చించారు. మహానాడు తొలి రోజు అంతా ఆత్మస్తుతి.. పరనిందగా సాగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడుగడుగునా విద్వేష రాజకీయాల్లో మునిగి తేలుతున్న తెలుగుదేశం పార్టీ.. కడప వేదికగా నిర్వహిస్తున్న మహానాడులోనూ అదే పంథాను కొనసాగించింది. సూపర్‌ సిక్స్‌ హామీలు సహా గత ఎన్నికలప్పుడు ఇచ్చిన వందలాది హామీల్లో ఒక్క దాన్ని అమలు చేయకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తుండడంతో దాన్ని కప్పిపుచ్చేందుకు ఏడాదిలో ఎన్నో విజ­యాలు సాధించామని లేనివి ఉన్నట్లు మహానాడులో చిత్రీకరించారు. చంద్రబాబు ప్రసంగం మొత్తం తన గొప్పలు, జగన్‌ పాలనపై విషం కక్కడానికే సరిపోయింది. సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచి ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ శాసనాలంటూ వాటి పేర్లనే మార్చి.. ఆయన కుమారుడు, ఐటీ మంత్రి లోకేశ్‌తో చెప్పించారు. గత హామీల తీరులో ఈ సూపర్‌ సిక్స్‌ శాసనాల ద్వారా యువత, మహిళలు, పేదలు, ఇతర వర్గాలన్నింటినీ పైకి తీసుకువస్తామని ఇప్పుడు ప్రకటించారు. ఇచ్చిన హామీలకే దిక్కు లేని పరిస్థితుల్లో ఈ కొత్త శాసనాలేంటని టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. ఎక్కడైనా ప్రజల కోసం పథకాలు, విధానాలు, కార్యక్రమాలు రూపొందించడం ఆనవాయితీ. అయితే చంద్రబాబు సారథ్యంలో లోకేశ్‌ శాసనాలంటూ సరికొత్త పద ప్రయోగంతో ముందుకు రావడం మరోమారు జనాన్ని మభ్యపెట్టి, మాయ చేయడానికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శాసనం అంటే ఎవరిని శాసిస్తారు.. ఏమని శాసిస్తారోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గత ప్రభుత్వం అంటూ అదే పనిగా విషంచంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలంతా గత ప్రభు త్వం, జగన్‌ ప్రభుత్వం అంటూ మహానాడులోనూ జపం చేస్తూనే ఉన్నారు. అప్పుడేదో జరిగిపోయిందని చెప్పడం ద్వారా ప్రజల్ని తన పాలన గురించి ఆలోచించకుండా చేయాలన్నదే చంద్రబాబు అండ్‌ కో వ్యూహమని స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఇంకా గత ప్రభుత్వం లెక్కలు తీస్తున్నామని, ఇంకా కొత్త విచారణలు జరపాల్సివస్తుందేమోనని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి ఇక రాష్ట్రా­నికి తాను చేసేదేమీ లేదని, ప్రతిపక్ష పార్టీ నేతలను వేధించడం, వారిని అన్యాయంగా కేసుల్లో ఇరికించి చిత్ర­హింసలు పెట్టడానికే కుతంత్రాలు పన్నుతు­న్నట్లు అర్థమవుతోంది. పార్టీ కార్యకర్తల మనసుల్లో విద్వేషం నింపి వారిని పగతో రగిలేలా చేయడం కోసమే గత ప్రభుత్వంపై అభాండాలు మోపడాన్ని చంద్రబాబు ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకుని దాన్ని మహానాడులోనూ కొనసాగించారు. ఇందులో భాగంగా తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ప్రసంగించడం గమనార్హం. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయకుండా ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించామని సీఎం ఎలా చెబుతారని ప్రజలు మండిపడుతున్నారు.తండ్రీ కొడుకులపై పొగడ్తలు ఎన్టీఆర్‌ హయాంలో సంస్కరణలు అమలు చేశామని, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీని అభివృద్ధి చేశామని, 2014–19లో ఇరగదీశామని ఇంకా పాత కథలు చెప్పుకోవడానికే చంద్రబాబు సహా నేతలంతా ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు పార్టీ నేతలంతా చంద్రబాబును, ఆయన కొడుకు, మంత్రి లోకేశ్‌ను పొగడటానికే పోటీపడ్డారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేలా పొగడ్తలతో ముంచెత్తారు. చాలా మంది నేతలు భూ ప్రపంచంలో చంద్రబాబు, లోకేశ్‌ అంత గొప్ప వారు ఎవరూ లేరన్న రీతిలో కీర్తించారు.‘మహా’కష్టాలు» నేలకూలిన కటౌట్లు.. పరుగులు తీసిన కార్యకర్తలు» మధ్యాహ్న భోజనాల దగ్గర తోపులాట » పార్టీ శ్రేణులు లేక బోసిపోయిన ప్రాంగణం » నిర్వాహకులపై బాబు సీరియస్‌ » మీడియాపై లోకేశ్‌ ఆంక్షలు సాక్షి ప్రతినిధి, కడప/కడప రూరల్‌: తెలుగుదేశం పార్టీ మహానాడు టీడీపీ కార్యకర్తలకు మహా కష్టాలు తెచ్చిపెట్టింది. మహానాడు సందర్భంగా ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు గాలికి నేలకొరిగాయి. దీంతో చాలా మంది తమను తాము రక్షించుకునేందుకు పరుగులు తీశారు. కటౌట్లు పడటంతో పార్కింగ్‌ చేసిన వాహనాలు దెబ్బతిన్నాయి. కటౌట్ల కారణంగా ఇప్పటికే ఇద్దరు వీఆర్వోలు గాయపడిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసిన చోట తోపులాట జరిగింది. కొంత మంది ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప నగరంలోకి వెళ్లి ఆకలి తీర్చుకున్నారు. ‘ఏమి ఏర్పాట్లో.. ఏమి కమిటీలో.. కనిపిస్తూనే ఉంది’ అని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది. కాగా, మధ్యాహ్నం భోజన సమయానికి మహానాడు ప్రాంగణం సగం ఖాళీ కాగా, సాయంత్రానికి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో చంద్రబాబు నిర్వాహకులపై సీరియస్‌ అయినట్లు సమాచారం. చివరగా మాట్లాడిన చంద్రబాబు.. చివరి వరకూ ఉండాలని, దీనిని బుధవారం నుంచైనా పాటించాలని కోరడం గమనార్హం. మధ్యాహ్నం మంత్రి నారా లోకేశ్‌ మీడియా సమావేశం నిర్వహిస్తారని సమాచారం ఇచ్చారు. లోకేశ్‌ అక్కడికి రాగానే.. కెమెరాలు ఆఫ్‌ చేయాలంటూ ఆదేశించారు. ఎవరైనా కెమెరా ఆన్‌ చేస్తే లాక్కొవాలంటూ పోలీసులకు సూచించారు. ఫొటోలు కూడా తీయనివ్వలేదు. మంత్రి లోకేశ్‌ మీడియా ప్రతినిధులతో కాసేపు చిట్‌చాట్‌ నిర్వహించి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా మహానాడు పూర్తిగా పార్టీ కార్యక్రమం అయినప్పటికీ అధికారులకు డ్యూటీలు వేశారు. జిల్లా సర్వోన్నతాధికారి డ్యూటీ పాస్‌లు ఇచ్చా­రు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ నాగ­రాజు ఎల్లో ట్యాగు తగలించుకొని కనిపించారు. కాగా, మహానాడుకు ముందే కరోనా పాజిటివ్‌ కేసులు రిమ్స్‌లో నమోదు అయితే, అబ్బే అలాంటిదేమీ లేదని జిల్లా వైద్యాధికారి ప్రకటించారు.

Bengaluru Joins Elite Global Tech Powerhouses With Workforce Surpassing 10 Lakh8
ఆ ఒక్క నగరంలో 10 లక్షల మంది టెకీలు..

భారత సిలికాన్‌ వేలీగా పేరొందిన బెంగళూరులో టెకీ సిబ్బంది సంఖ్య 10 లక్షల మార్కును దాటింది. తద్వారా అంతర్జాతీయంగా 12 టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా నిలిచింది. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సీబీఆర్‌ఈ విడుదల చేసిన గ్లోబల్‌ టెక్‌ టాలెంట్‌ గైడ్‌బుక్‌ 2025’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం నిపుణుల లభ్యత, నాణ్యత, వ్యయాల ప్రాతిపదికన 115 మార్కెట్లను మదింపు చేసి మూడు కేటగిరీలుగా వర్గీకరించారు.అత్యధిక స్థాయిలో నిపుణుల లభ్యత, తీవ్రమైన పోటీ ఉన్న మార్కెట్లను పవర్‌హౌస్‌లుగా, ప్రతిభావంతుల లభ్యత నిలకడగా ఉండే మార్కెట్లను ఎస్టాబ్లిష్డ్ మార్కెట్లుగా, సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటూ వృద్ధి చెందుతున్న మార్కెట్లను వర్ధమాన మార్కెట్లుగా వర్గీకరించారు. 12 టెక్‌ పవర్‌హౌస్‌లలో బీజింగ్, బోస్టన్, లండన్, న్యూయార్క్, ప్యారిస్‌ తదితర నగరాల సరసన బెంగళూరు కూడా నిల్చింది.ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో బీజింగ్, షాంఘైతో పాటు బెంగళూరులో అత్యధికంగా టెక్నాలజీ నిపుణులు ఉన్నారని, టెక్‌ సిబ్బంది సంఖ్య 10 లక్షల పైగా ఉందని నివేదిక పేర్కొంది. గ్లోబల్‌ టెక్‌ పవర్‌హౌస్‌గా బెంగళూరు ఎదగడమనేది భారత్‌లో డిజిటల్‌ ఆవిష్కరణలు, కృత్రిమ మేథకు సంబంధించి లోతైన పరిజ్ఞానాన్ని తెలియజేస్తోందని వివరించింది.ఇదీ చదవండి: అప్పుడు రూ. 3500కోట్ల వ్యాపార సామ్రాజ్యం: ఇప్పుడు 20ఏళ్ల జైలు జీవితంఉద్యోగం చేసే వయస్సు గల జనాభాపరంగా 12 భారీ మార్కెట్లలో బెంగళూరు నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. 28 యూనికార్న్‌లు (1 బిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్‌ గల స్టార్టప్‌లు), సానుకూల నిబంధనలు మొదలైనవి నగరానికి సానుకూలాంశాలుగా ఉంటున్నాయి. 2024లో 3.3 బిలియన్‌ డాలర్లు విలువ చేసే 140 వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ డీల్స్‌కి బెంగళూరు కేంద్రంగా నిల్చింది. వీటిలో 34 డీల్స్‌ కృత్రిమ మేథకు సంబంధించినవి ఉన్నాయి.

Shah Rukh Khan As Brand Ambassador of Candere9
ఒకే ఇంట్లో షెహన్‌షా, బాద్‌షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్

ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ 'షారుక్ ఖాన్‌'ను కందేరే ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్‌తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్‌కు, మరోవైపు ఆధునికత, డిజైన్‌పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్‌కు షారుక్ ఖాన్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్‌గా 75కి పైగా రిటైల్ అవుట్‌లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్‌స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్‌షా (బచ్చన్) మరియు బాద్‌షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

Bengaluru beat Lucknow by 6 wickets10
జితేశ్‌ జితాదియా

లక్నో: సొంతగడ్డపై విజయగర్వంతో సీజన్‌ను ముగించే భారీ స్కోరునే లక్నో చేసింది... ఛేదనలో సాల్ట్, లివింగ్‌స్టోన్, కోహ్లిలాంటి విలువైన వికెట్లను తీసింది. 52 బంతుల్లో 105 పరుగుల సమీకరణం బెంగళూరుకు క్లిష్టంగా అనిపించింది... అయితే కెప్టెన్ జితేశ్‌... మయాంక్‌తో కలిసి చేసిన బ్యాటింగ్‌ మ్యాజిక్‌ మ్యాచ్‌నే మార్చేసింది. ఇంకో 8 బంతులు మిగిలుండగానే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై జయభేరి మోగించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్‌ పంత్‌ (61 బంతుల్లో 118 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) సీజన్‌లో తొలి సెంచరీతో కదం తొక్కగా, మిచెల్‌ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. అనంతరం బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జితేశ్‌ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు) చెలరేగారు. చితగ్గొట్టిన పంత్‌ మార్ష్ తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బ్రిట్‌జ్కీ (14) మూడో ఓవర్లో నిష్క్రమించాడు. తర్వాత రిషభ్‌ పంత్‌ రావడంతో లక్నో ప్రతీ ఓవర్లోనూ పండగ చేసుకుంది. యశ్‌ దయాళ్‌ వేసిన నాలుగో ఓవర్లో ఒక సిక్స్, రెండు బౌండరీలు బాదడం ద్వారా పంత్‌ ప్రతాపం మొదలైంది. పవర్‌ప్లే తర్వాత ఓ వైపు మార్ష్, ఇంకోవైపు రిషభ్‌ ధనాధన్‌ షోతో ఓవర్‌కు సగటున పది పరుగుల రన్‌రేట్‌ నమోదైంది. దీంతో 9.5 ఓవర్లో జెయింట్స్‌ 100 స్కోరును చేరుకుంది.ముందుగా పంత్‌ 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్లో సిక్సర్‌తో మార్ష్ 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఆ ఓవర్లో రిషభ్‌ కూడా ఫోర్, సిక్స్‌ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన మార్ష్ ను భువనేశ్వర్‌ అవుట్‌ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 152 పరుగుల సుదీర్ఘ భాగస్వామ్యానికి తెరపడింది. అతని మరుసటి ఓవర్లో బౌండరీతో పంత్‌ 54 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకోవడం, జట్టు 200మార్క్‌ దాటడం జరిగిపోయాయి. మెరుపు భాగస్వామ్యం... సాల్ట్, కోహ్లిలు పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు అవసరమైన మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు బౌండరీలతో స్కోరుబోర్డును పరుగు పెట్టించారు. 4 ఓవర్లలోనే స్కోరు 50కి చేరింది. కానీ పవర్‌ప్లే ఆఖరి ఓవర్లోనే సాల్ట్‌ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది. తర్వాత కోహ్లికి జతయిన రజత్‌ పటిదార్‌ (14) ఫోర్, సిక్సర్‌ బాదాడు. కానీ రూర్కే ఒకే ఓవర్లో అతన్ని, లివింగ్‌స్టోన్‌ (0)ను అవుట్‌ చేసి బెంగళూరును కష్టాల్లో పడేశాడు. కోహ్లి తన మార్క్‌ షాట్లతో చెలరేగిపోవడంతో రన్‌రేట్‌ లక్ష్యాన్ని కరిగించేంత వేగంగా దూసుకెళ్లింది. 9.1 ఓవర్లోనే ఆర్సీబీ స్కోరు వందను దాటేసింది. కోహ్లి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ధాటిని కొనసాగించే ప్రయత్నంలో కొట్టిన షాట్‌ మిడాఫ్‌లో బదోని చేతికి చిక్కడంతో కోహ్లి నిరాశగా వెనుదిరిగాడు. అప్పుడు జట్టు స్కోరు 11.2 ఓవర్లలో 123/4. కాగా గెలుపు సమీకరణం 52 బంతుల్లో 105 చాలా కష్టమైంది.మయాంక్, కెప్టెన్ జితేశ్‌ శర్మల మెరుపులకు తోడు... లక్నో ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్, సులువైన రనౌట్‌పట్ల రూర్కే అశ్రద్ధ వెరసి... పరుగులు, బౌండరీలు అలవోకగా రావడంతో చూస్తుండగానే లక్ష్యం దిగొచ్చింది. అబేధ్యమైన ఐదో వికెట్‌కు మయాంక్, జితేశ్‌లు కేవలం 44 బంతుల్లోనే 107 పరుగులు జోడించడం విశేషం! స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్ష్ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 67; బ్రిట్‌జ్కీ (బి) తుషార 14; పంత్‌ నాటౌట్‌ 118; పూరన్‌ (సి) యశ్‌ దయాళ్‌ (బి) షెఫర్డ్‌ 13; సమద్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 227. వికెట్ల పతనం: 1–25, 2–177, 3–226. బౌలింగ్‌: తుషార 4–0–26–1, కృనాల్‌ పాండ్యా 2–0–14–0, యశ్‌ దయాళ్‌ 3–0–44–0, భువనేశ్వర్‌ 4–0–46–1, సుయశ్‌ 3–0–39–0, షెఫర్డ్‌ 4–0–51–1. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) దిగ్వేశ్‌ (బి) ఆకాశ్‌ 30; కోహ్లి (సి) బదోని (బి) అవేశ్‌ఖాన్‌ 54; పటిదార్‌ (సి) సమద్‌ (బి) రూర్కే 14; లివింగ్‌స్టోన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) రూర్కే 0; మయాంక్‌ నాటౌట్‌ 41; జితేశ్‌ నాటౌట్‌ 85; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 230. వికెట్ల పతనం: 1–61, 2–90, 3–90, 4–123. బౌలింగ్‌: ఆకాశ్‌ 4–0–40–1, విల్‌ రూర్కే 4–0–74–2, దిగ్వేశ్‌ రాఠి 4–0–36–0, షాబాజ్‌ 3–0–39–0, అవేశ్‌ఖాన్‌ 3–0–32–1, బదోని 0.4–0–9–0. ఐపీఎల్‌ ‘ప్లే ఆఫ్స్‌’క్వాలిఫయర్‌–1 (మే 29)పంజాబ్‌ X బెంగళూరువేదిక: ముల్లాన్‌పూర్‌ , రాత్రి 7: 30 గంటల నుంచిఎలిమినేటర్‌ (మే 30)గుజరాత్‌ X ముంబైవేదిక: ముల్లాన్‌పూర్‌ , రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement