ఉమ్మడి రాజధానిగా మూడేళ్లు చాలు | 3 years enough hyderabad as common capital | Sakshi
Sakshi News home page

ఉమ్మడి రాజధానిగా మూడేళ్లు చాలు

Nov 7 2013 11:54 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ నగరాన్ని మూడేళ్లు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, ఇదే తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి అన్నారు.

 పరిగి, న్యూస్‌లైన్:
 హైదరాబాద్ నగరాన్ని మూడేళ్లు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, ఇదే తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి అన్నారు. పరిగిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా జేఏసీ, విద్యావంతుల వేదిక, టీఆర్‌ఎస్ సంయుక్తంగా జీఓఎంకు రాసిన లేఖ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ మూడు విభాగాలుగా విభజించబడి ఉందన్నారు. మొదటిది 1996 నుంచి ఉన్న నగర పాలక సంస్థ (ఎంసీహెచ్), రెండోది 2007 నుంచి ఉన్న గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ), మూడోది 2010 తరువాత ఏర్పాటు చేసిన (హెచ్‌ఎండీఏ) మెట్రో పాలిటన్ సిటీగా రూపాంతరం చెందిందన్నారు. 174 కిలో మీటర్ల పరిధితో నగర పాలక సంస్థగా ఉన్న హైదరాబాద్ ప్రాంతాన్ని మాత్రమే తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయాలని హరీశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
 
 హెచ్‌ఎండీఏ పరిధిని ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రాంతం రెవెన్యూ, ఉద్యోగాలు, పాలనా పరంగా నష్టపోతుందన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని అనంతగిరి జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ వికారాబాద్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. తాండూర్‌ను మైనింగ్ జోన్‌గా గుర్తించటంతో పాటు అక్కడ కంది బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు నిధులు మం జూరు చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగర శివారులోని రంగారెడ్డి పరిధిలో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు.  
 
 పరిగికి డిగ్రీ కళాశాల మంజూరు...
 పరిగికి ప్రభుత్వ డిగ్రీకళాశాల మంజూరైందని హరీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. త్వరలో ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభిస్తామన్నారు.  పంటనష్టం సర్వేను సక్రమంగా నిర్వహించాలని, రచ్చబండ కార్యక్రమాన్ని అన్ని గ్రామా ల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఆంజనేయులు, విద్యావంతుల వేదిక నియోజకవర్గ చైర్మన్ బసిరెడ్డి, స్థానిక సర్పంచ్ విజయమాల, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ ఎస్పీ బాబయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement