అండగా ఉంటాం | Agri gold victims met YSRCP chief YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాం

Published Fri, Mar 24 2017 2:36 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

అండగా ఉంటాం - Sakshi

అండగా ఉంటాం

అగ్రిగోల్డ్‌ బాధితులకు జగన్‌ భరోసా
మధురానగర్‌ (విజయవాడ సెంట్రల్‌) : ‘‘అగ్రిగోల్డ్‌ బాధితులకు పూర్తి న్యాయం జరిగేవరకు మీ అందరి తరపున పోరాడ తాను. చంద్రబాబు చర్మం కాస్త మందం. ఆయన అంతగా స్పందించరు. కానీ పోరాటం ఆపేదే లేదు. ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయా యి. మరో రెండేళ్లు ఓపిగ్గా పోరాడదాం. ఆ తరువాత రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజులకే అగ్రిగోల్డ్‌ బాధితులకు పూర్తి న్యాయం చేస్తాం. రూ.1182 కోట్లు కేటాయిం చి 14 లక్షల మంది బాధితులను  ఆదుకుం టాం.అంతేకాదు చనిపోయిన అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తామన్న రూ.3 లక్షలకు అదనంగా మా ప్రభుత్వం మరో రూ.7 లక్షలు చొప్పున పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తాం. రెండేళ్ల తరువాత వచ్చే మనందరి ప్రభుత్వం మానవత్వం ఉన్న ప్రభుత్వమని నిరూపిస్తాం...’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌ సుస్పష్టమైన హామీ ఇచ్చారు.

దీంతో అగ్రిగోల్డ్‌ బాధిత కుటుంబ సభ్యులు, దీక్షా ప్రాంగణంలో ఉన్నవారం దరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్‌ హనుమంతరాయ గ్రంథాలయం వద్ద అగ్రిగోల్డ్‌ బాధితుల దీక్షా శిబిరాన్ని ఆయన గురువారం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలతో కలసి బాధితులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. దీక్షాశిబిరం వద్ద, అంతకు ముందు అసెంబ్లీ వెలుపల ఆయన అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలపై ఇలా ప్రసంగించారు...

బాధితుల గోడు వినే ఓపికే బాబుకు లేదు
అగ్రిగోల్డ్‌ బాధితుల గోడుపై అసెంబ్లీలో చర్చకు మేము పట్టుబడితే కనీసం వినే ఓపిక కూడా చంద్రబాబుకు లేకుండాపోయింది. ముందు ఆయన స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు. తరువాత దానిపై స్పందించేందుకు 10 నిమిషాల నుంచి 20నిమిషాలు మాత్రమే మైక్‌ ఇచ్చారు. నేను అగ్రిగోల్డ్‌ బాధితుల ఆవేదనను చెబుతుంటే వినే ఓపిక కూడా లేకుండా మైక్‌ పలుసార్లు కట్‌ చేయించారు. ఆ తరువాత ఎవరెవరికో మైక్‌ ఇచ్చి నన్ను తిట్టించారు. అయినా నేనేమీ బాధపడలేదు.

 అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగితే అదే చాలనుకున్నాను. అగ్రిగోల్డ్‌ బాధితులు ఇప్పటికి 105మంది చనిపోయారు. చంద్రన్న బీమా కింద రూ.5లక్షలు ఎవరెవరికో ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అలా ఎవరికీ ఇచ్చిందీ ఏమీ కూడా లేదు. చనిపోయిన అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆ రూ.5లక్షల చొప్పున అయినా సరే ఇవ్వండని కోరుదామన్నా ఈ ప్రభుత్వానికి వినే ఓపిక లేకుండాపోయింది. అగ్రిగోల్డ్‌ బాధితులకు కేవలం రూ.3 లక్షలు మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంది.

మీరిచ్చిన సమాచారంతోనే పోరాడాను
మంత్రి పుల్లారావు నాకేమీ శత్రువు కాదు. అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ తమ్ముడు సీతారాం ఎవరో కూడా నాకు తెలీదు. మీరంతా వచ్చి అన్యాయం జరిగిందని వాపోవడం వల్లే బాధ్యతాయుత ప్రతిపక్షంగా స్పందించి మీ తరపున పోరాడుతున్నాను. అగ్రిగోల్ట్‌ ఆస్తులు అటాచ్‌మెంట్‌ జరుగబోతోందని తెలిసి కూడా మంత్రి పుల్లారావు భూములు కొన్నారని మీరిచ్చిన సాక్ష్యాధారాలతోనే మాట్లాడాను. అమ్మిన వ్యక్తి చైర్మన్‌ బంధువేనని, హాయ్‌ల్యాండ్‌లో డైరెక్టర్‌గా కూడా ఉన్నారని తెలిపాను. దీనిపై సిటింగ్‌ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తే అన్నీ తెలుస్తాయి. హాయ్‌ల్యాండ్‌ ఆస్తులు, విశాఖలోని యారాడ ఆస్తులను, అతిహŸయ షాపింగ్‌మాల్‌ వంటివి వేలం పరిధిలోకి ఎందుకు తీసుకు రాలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

సభను పక్కదారి పట్టించారు
అగ్రిగోల్డ్‌ బాధితులపై చర్చ జరుగుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం సభను పక్కదారి పట్టించింది. ఎప్పుడో 40, 50 రోజుల కిందట మహిళా పార్లమెంట్‌ సదస్సు సందర్భంగా స్పీకర్‌ మహిళలను గురించి కాస్త వెటకారంగా అన్న మాటలను ముందుకు తెచ్చింది. ఆ సదస్సుకు ముందురోజు స్పీకర్‌ మీడియాతో మాట్లాడుతూ ‘కారు షెడ్డులోనే ఉండాలి. మహిళలు వంటింట్లోనే ఉండాలి. అలా అయితేనే రేప్‌లు జరగవు’అని వెటకారంగా అన్నారు.

దీన్ని అన్ని పత్రికలు ప్రచురించాయి. అన్ని టీవీలు చూపించాయి. ‘సాక్షి’ ఒక్కటే  కాదు... జాతీయ ఛానళ్లు, పత్రికలు కూడా ప్రముఖంగా చూపించాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్క ‘సాక్షి’నే లక్ష్యంగా చేసుకుంది. అగ్రిగోల్డ్‌ బాధితులపై చర్చ జరగాల్సి ఉండగా సభను అర్ధంతరంగా వాయిదావేసింది. మళ్లీ పదినిముషాల్లోనే అందర్నీ పిలిచారు. టీవీలు తెచ్చి పెట్టారు. స్పీకర్‌ మాటలను ‘సాక్షి’లో ప్రసారం చేసిన క్యాసెట్లు చూపించారు. అలాగే చంద్రబాబు ఓటుకు కోట్లు కేసును కూడా చూపించి ఉండాల్సింది. ఆ గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్‌ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు సీఎంకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ టేపులు ప్రదర్శించాలని ముఖ్యమంత్రికి, స్పీకర్‌కు అనిపించలేదు. కావాలనే పక్కదారి పట్టిస్తున్న ఆ కౌరవ సభను చూడలేకే బయటకు వచ్చాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement