
జిప్మర్ తరహాలో ఎయిమ్స్ ఏర్పాటు
మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి
మంగళగిరి : జిప్మర్ ఆసుపత్రిలాంటి ఆధునిక సదుపాయాలతో సుమారు 1500 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్ను నిర్మించేందుకు స్థల పరిశీలన జరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఎయిమ్స్ ఏర్పాటుకు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని టీబీ శానిటోరియం స్థలాన్ని పరిశీలించేందుకు గురువారం విచ్చేసిన మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఎయిమ్స్ నిర్మాణానికి శానిటోరియం స్థలం అనువుగా ఉందన్నారు. అయితే తాము స్థలాన్ని పరిశీలించి కేంద్రబృందానికి పంపుతామని చెప్పారు.
ఎయిమ్స్ నిర్మాణం కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 125 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందన్నారు. శానిటోరియంలో ఇప్పటికే ఎన్టీఆర్ యూనివర్శిటితో పాటు ఎన్డీఆర్ఎఫ్కు భూములు కేటాయించి వున్నాయని, ఎన్డీఆర్ఎఫ్కు అమరావతి టౌన్ షిప్లో వున్న 80 ఎకరాల స్థలం కేటాయించి శానిటోరియం స్థలాన్ని పూర్తిగా ఎయిమ్స్కు కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణలో ఆంధ్ర విద్యార్థులకు కేసీఆర్ ఫీజులు చెల్లించకుంటే తమ ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు.