సాక్షి, అమరావతి : కర్ణాటకలో తెలుగు విద్యార్థులపై కన్నడ సంఘాల దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. సమన్వయ కమిటీ సమావేశంలో శనివారం ఈ అంశంపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా కర్ణాటక డీజీపీ, సీఎస్లతో మాట్లాడాలని సీఎంవో అధికారి సతీష్ చంద్రకు సూచించారు. తెలుగు విద్యార్థుల రక్షణకు కర్ణాటక సర్కార్తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
కాగా కర్ణాటకలో ఐబీపీఎస్, ఆర్ఆర్బీ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు అభ్యర్థులను కన్నడ సంఘాలు అడ్డుకున్న విషయం తెలిసిందే. కర్ణాటక రీజనల్ లోని తమ ఉద్యోగాలను తెలుగు విద్యార్థులు కొల్లగొడుతున్నారని ఆరోపిస్తూ...పరీక్షలు రాయడానికి వెళ్లిన తెలుగువారిపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎస్ దినేష్ కుమార్ ... కర్ణాటక సీఎస్, డీజీపీతో మాట్లాడారు. రేపు, ఎల్లుండి జరిగే పరీక్షలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.