
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా, పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో తాము నిర్మించిన భవనం అక్రమ నిర్మాణమేనని ఆంధ్రజ్యోతి యాజమాన్యం బుధవారం హైకోర్టులో అంగీకరించింది. దీని క్రమబద్ధీకరణ కోసం బీపీఎస్ కింద పెట్టుకున్న దరఖాస్తును అధికారులు తిరస్కరించారని పిటిషనర్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి అనూష తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. నిర్మాణాన్ని కూల్చివేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును పదే పదే కోరారు. హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ నిర్మాణం కూల్చివేతపై ఇప్పటికే స్టే ఉందని, మరోసారి స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
అనుమతే తీసుకోలేదు...
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ అనుమతి తీసుకోకుండానే భవనాన్ని నిర్మించారని, నిర్మాణం పూర్తయిన తరువాత అనుమతి కోసం దరఖాస్తు చేశారన్నారు. గడువు తేదీ ముగిసిన తరువాత దరఖాస్తు సమర్పించారని తెలిపారు. ఆగస్టు 31, 2018 నాటికి నిర్మాణాలు పూర్తయిన భవనాలకే బీపీఎస్ వర్తిస్తుందని వివరించారు. పిటిషనర్ 2018 డిసెంబర్ 29న భవన నిర్మాణానికి దరఖాస్తు సమర్పించారన్నారు. అలాంటప్పుడు ఆగస్టులో భవన నిర్మాణం పూర్తయిందని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు పిటిషనర్ నాలుగు వ్యాజ్యాలు దాఖలు చేశారని, ఒక దానికొకటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. వారు ప్రమాణ పూర్వకంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలను పరిగణనలోకి తీసుకున్నా ఆ భవనం అక్రమ నిర్మాణమే అవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment