
సాక్షి, అమరావతి: సాధారణ ఎన్నికలకు ముందు చివరి అసెంబ్లీ సమావేశాలు 30వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయని రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 5వ తేదీన పూర్తి స్థాయి ఓటాన్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టే ఎత్తుగడలో భాగంగా పూర్తి స్థాయి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను రూ.రెండు లక్షల కోట్లకు పైగా అంచనాలతో రూపొందించనున్నారు.
పలు రంగాలకు రూ.వేల కోట్లు కేటాయించినట్లు ప్రచారం చేసుకోవడమే ధ్యేయంగా బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు. అయితే పూర్తిస్థాయి బడ్జెట్లోనే ఏప్రిల్, మే నెలలకు ఓటాన్ బడ్జెట్కూ అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు ఆయా రంగాలకు భారీ మొత్తంలో కేటాయించామనే ప్రచారం చేసుకునేలా బడ్జెట్ రూపకల్పన చేయాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment