
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ)ల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ప్రభుత్వం నియామకాలు చేసింది. బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలు, మహిళలకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయా వర్గాలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనులు, కాంట్రాక్టులు, ఔట్ సోర్సింగ్ కొలువుల్లో కోటాను కూడా అమల్లోకి తెస్తూ అసెంబ్లీలో ప్రత్యేకంగా చట్టాన్ని కూడా ఆమోదింపచేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను టీడీపీ హయాంలో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా అమ్ముకుంటూ కాంట్రాక్టు సంస్థలు భర్తీచేయగా ముఖ్యమంత్రి జగన్ దీన్ని పూర్తిగా రద్దు చేయించారు. ఈ పోస్టుల భర్తీకి ప్రైవేట్ సంస్థలను తప్పించి ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫునే కార్పొరేషన్ ఏర్పాటు చేయించారు. నిరుద్యోగులు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే కొత్త చట్టంలో నిర్దేశించిన రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు చేపట్టే విధానాన్ని తెచ్చారు. గతంలో ఆ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో కొంత మొత్తం ప్రైవేట్ సంస్థలు కమీషన్ల కింద వసూలు చేసుకునేవి. ఇప్పుడు నేరుగా మొత్తం వేతనం ఉద్యోగికే దక్కేలా చేశారు. అలాగే మహిళలకు అన్ని పదవులు, పనుల్లో 50 శాతం కోటాను చట్టబద్ధం చేయించారు.
బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు ప్రాధాన్యం
వర్సిటీ నామినేటెడ్ పదవుల్లో కూడా ఆయా వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. రాష్ట్రంలోని 14 వర్సిటీల్లోని ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో 116 మందిని నామినేట్ చేయగా 63 (54.31 శాతం) మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉండటం గమనార్హం. మహిళలకు మొత్తం పోస్టుల్లో 50 శాతం (58 పోస్టులు) కేటాయించారు. ఐదుగురు మైనార్టీలతో కలుపుకొని బీసీలు 34 మంది, ఎస్సీలు 23 మంది, ఎస్టీలు ఆరుగురు ఉన్నారు.
వర్సిటీల వారీగా ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో నియామకాలు