
శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/ఆమదాలవలస: కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్కు స్పీకర్ తమ్మినేని సీతారాం, వాణీ సీతారాంలు కలిసి రూ.35లక్షలు విరాళం సీఎం జగన్మోహన్రెడ్డికి అందజేశారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఈ చెక్కును ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమదాలవలసలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. నారాయణపురం ఆనకట్ట, మడ్డువలస ప్రాజెక్ట్ నిర్మాణాలను గురించి ప్రస్తావించారు.
సీఎంను కలిసిన మంతి కృష్ణదాస్
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం కలిశారు. జిల్లాలోని పరిస్థితులు, పలు అభివృద్ధి పనులను వివరించారు. ఈ నెల 8న చేపట్టనున్న ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధం చేసిన స్థలాల వివరాలను తెలియజేశారు.
తిలక్ రూ.50 లక్షల విరాళం
టెక్కలి: టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రజల తరఫున వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ఆర్అండ్బీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో సీఎం జగన్మోహన్రెడ్డికి క్యాంపు కార్యాలయంలో విరాళం అందజేశారు. టెక్కలిలో మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంతబొమ్మాళి, కోటబొమ్మాళిలో మండలాల్లో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు, ఆఫ్షోర్ రిజర్వాయర్ సమస్య, రావివలస మెట్కోర్ పరిశ్రమ కార్మికుల సమస్య, నందిగాంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి పనులు, గెస్ట్ లెక్చరర్ల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ 1108 జీఓ రద్దు చేసి ఉద్యమంలో కేసుల బారిన పడిన వారిని విముక్తి చేయాలని కోరారు.