
సీమకు అన్యాయం చేస్తే ప్రత్యేక ఉద్యమం
కర్నూలు : శ్రీశైలం జలాల విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇదే కొనసాగితే భవిష్యత్తులో ప్రత్యేక ఉద్యమం వస్తుందని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. శ్రీశైలం నీరు సాగర్కు విడదుల చేయడానికి నిరసనగా రాయలసీమ సాగు నీటి సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇచ్చాయి.
ఈ సందర్భంగా రాయలసీమ సాగు నీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి∙మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయం శ్రీశైలలమని, నీటి పంపకాల విషయంలో తెలంగాణ ఒత్తిళ్లకు తలొగ్గి సీమ గురించి ఏ మాత్రం పట్టించుకోవడం విచారకరమన్నారు. సీమకు ప్రత్యేక హోదా కంటే సాగు నీరే ముఖ్యమన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో ప్రాంతాల మద్య విభేదాలు వచ్చి ప్రత్యేక ఉద్యమాలకు దారితీస్తాయన్నారు. తీరు మార్చుకోకపోతే సీమలో సీఎం చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాయల సీమకు చెందిన తెలుగు దేశం పార్టీ నేతలు అన్యాయంపై నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. కలెక్టరేట్ ముట్టడిలో వైఎస్ఆర్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, బీజేపీ నాయకుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు, రైతు సంఘాలు నాయకులు పాల్గొన్నారు.