
మోపిదేవి వెంకటరమణకు తాత్కాలిక బెయిలు మంజూరు
హైదరాబాద్: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు తాత్కాలిక బెయిల్ మంజూరైంది. నాంపల్లి సీబీఐ కోర్టు ఆయనకు 45 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న మోపిదేవి వెంకట రమణారావుకు వైద్య చికిత్సల కోసం మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది సురేందర్రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ మేరకు మోపిదేవి దాఖలు చేసుకున్న పిటిషన్ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు విచారించారు. మోపిదేవిని పరీక్షించిన కేర్ వైద్యులు ఆయనకు మొదటగా స్టెరాయిడ్లతో కూడిన ఇంజక్షన్లు ఇవ్వాలని, ఫలితం లేకపోతే శస్త్రచికిత్స చేయాలన్నారని సురేందర్రావు వివరించారు.
వైద్యం పొందడం పౌరుడి కనీస హక్కని, మోపిదేవి తీవ్రమైన అనారోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు కనీసం మూడు నెలలైనా బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ధారిస్తేనే బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఈ కోర్టు గతంలో స్పష్టం చేసిందని, మొదట స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇస్తారని మోపిదేవి చెబుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణార్హం కాదని సీబీఐ స్పెషల్ పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఈరోజుకు వాయిదా వేశారు. ఈరోజు బెయిల్ మంజూరు చేశారు.