బెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలు ఐదుగురికి దానం ‘మా తమ్ముడి మృతితో మా కుటుంబం అనాథగా మారింది. అయినా అవయవాలను దానం చేయడం ద్వారా మా తమ్ముడు సజీవంగా ఉంటాడనే ఆత్మ సంతృప్తి దక్కింది. మా మణికంఠ మానుంచి భౌతికంగా దూరమైనా ఐదుగురి ప్రాణాలను నిలిపి సజీవంగా నిలిచాడు.’అంటూ మణికంఠ సోదరి శివనాగజ్యోతి తీవ్ర ఉద్వేగానికి లోనైంది. ఈ సందర్భంగా, శివనాగజ్యోతిని ఎన్ఆర్ఐ ఆసుపత్రి యాజమాన్యంతో పాటు అక్కడికి విచ్చేసిన అనేకమంది వైద్యులు, ప్రముఖులు, ప్రజలు అభినందించారు. అవయవదానంతో సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
మంగళగిరి ఆ యువకుడి పేరు తోట మణికంఠ. పదవ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పించిన కుటుంబ పరిస్థితి. కృష్ణాజిల్లా రామవరప్పాడు నెహ్రూనగర్లో నివాసం. తండ్రి శ్రీనివాసరావు కొద్దికాలం కిందట మృతి చెందడంతో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి.
అనారోగ్యంతో ఉన్న తల్లి రాధమ్మను బాగా చూసుకోవాలని, సోదరి శివనాగజ్యోతిని ఉన్నత చదువులు చదివించాలని తాను కారు డ్రైవర్గా మారాడు. ఈ నేపథ్యంలో 3వతేదీ అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి ఇంటికి వెళుతుండగా, సెట్విన్ ఆసుపత్రి వద్ద లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మణికంఠను చికిత్స నిమిత్తం తొలుత ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అవసరం కావడంతో అక్కడి నుంచి విజయవాడలోని మెట్రో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ ఎన్. శ్రీనివాసరావు శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే విధి మణికంఠను చిన్న చూపు చూసింది.
దేహానికి ప్రాణం ఉన్నా బ్రెయిన్డెడ్ అయింది. తల్లీ, సోదరి తల్లడిల్లిపోయారు. కుటుంబానికి ఒకే ఒక్క ఆధారమైన మణికంఠను బతికించుకోవాలని తపన పడ్డారు. ఏ వైద్యుడిని కలిసినా లాభం లేదని తేల్చి చెప్పారు. అప్పటికే నర్సింగ్ విద్యనభ్యసిస్తున్న మణికంఠ సోదరి జ్యోతి తన తల్లి, బంధువులతో మాట్లాడి తమ్ముడి అవయవాలను దానం చేయాలనీ, మరికొందరిలో మణికంఠను చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రవిరాజుకు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఆయన జీవన్దాన్ అనే సంస్థను సంప్రదించి మణికంఠను కెడావర్ ట్రాన్స్ప్లాంట్(అవయవమార్పిడి)కు అవకాశం వున్న ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. గ్రీన్ ఛానల్ ద్వారా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ డీజీపీలతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదించి అత్యవసరంగా అవయవాలు కావాల్సిన వారి కోసం సమాచారం పంపారు. చెన్నైలోని రోగికి గుండె, ఎన్ఆర్ఐ ఆసుపత్రిలోని రోగికి ఒక కిడ్నీ, హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలోని రోగికి కాలేయం, గుంటూరు సిటీ ఆసుపత్రి రోగికి మరో కిడ్నీ, పెదకాకానిలోని శంకర్ కంటి ఆసుపత్రికి కళ్లను అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ క్రమంలో చెన్నైలోని రోగికి మణికంఠ గుండెను అమర్చేందుకు ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందం శుక్రవారం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని రోడ్డు మార్గాన ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వచ్చారు. శస్త్రచికిత్స అనంతరం మణికంఠ గుండెను సజీవంగా సాయంత్రం అదే విమానంలో చెన్నై తరలించారు. గుండెను తరలించే క్రమంలో ఇక్కడి వైద్యులతోపాటు ఇటు గుంటూరు, అటు కృష్ణా జిల్లాల రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం విశేష సహాయ సహకారాలు అందించారు. మణికంఠ మిగిలిన అవయవాలను కూడా ఆయా ఆసుపత్రులలోని రోగులకు అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు.
మణిదీపం
Published Sat, Mar 7 2015 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM
Advertisement
Advertisement