విభజన లేఖను బాబు ఉపసంహరించుకోవాలి
సాక్షి, తిరుపతి : రాష్ట్ర విభజనను అంగీకరిస్తూ ఇచ్చిన లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వెంటనే వెనక్కు తీసుకోవాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి డిమాండు చేశారు. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలో పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్రెడ్డి 560 వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మేకపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజనపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా చంద్రబాబు బస్సుయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక పక్క విభజనకు అనుకూలమంటూనే పార్లమెంటులో పార్టీ ఎంపీలతో ధర్నాలు చేయిస్తున్నారని విమర్శిం చారు. హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని చెబుతూనే దానిని పోగొట్టుకోవడానికి బాబు సిద్ధమవుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్సీపీ స్పష్టమైన నిర్ణయం తీసుకుందని, చంద్రబాబు కూడా స్పష్టత ఇవ్వాలని మేకపాటి డిమాండ్ చేశారు. షర్మిల సమైక్య శంఖారావానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి కాంగ్రెసు, టీడీపీ అనే రెండు విఘ్నాలున్నాయని, ఇవి 2014తో తొలగిపోతాయని.. సమైక్య రాష్ట్రానికి జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు రోజా అన్నారు.
సీడబ్ల్యూసీ నిర్ణయం శాసనం కాదు
నెల్లూరు: రాష్ట్ర విభజన విషయంలో సీడ బ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం శాసనం కాదని మేకపాటి రాజమోహన్రెడ్డి చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు వీఆర్సీ సెంటర్లో రిలేదీక్షలు చేస్తున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ అధ్యాపకులకు శనివారం ఆయన సంఘీభావం ప్రకటించారు. సీమాంధ్రుల్లో పెల్లుబుకుతున్న ఉద్యమం, ఆందోళనల వివరాలను నిఘా వర్గాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని చెప్పారు. ఈ సమయంలోనే సీమాంధ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.