
'చంద్రబాబు నేరం అంగీకరించారు'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు తన తప్పు ఒప్పుకుని హుందాగా వ్యవహరించాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. 'ఒక ఓటు- 5 కోట్లు' కేసులో రోజుకో ఆధారాలు దొరుకుతున్నాయని అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబుకు ప్రత్యేకంగా లై డిటెక్టర్ పరీక్షలు అవసరం లేదని చెప్పారు. నేరాన్ని ఆయన అంగీకరించినట్టు స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన ఫోన్ ట్యాప్ చేయలేదని చంద్రబాబు చెప్పారని తెలిపారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నేరాన్ని అంగీకరించి జ్యుడీషియల్ విచారణకు కోర్టు ముందుకు వెళ్లాలని అన్నారు. 5 కోట్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి చంద్రబాబుకు విచారణకు అంగీకరించాలని కోరారు. ఈ కేసు రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాప్ అయిందని, సెక్షన్ 8 అంటూ ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఒక వర్గం మీడియా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఏపీలోని 13 జిల్లాల్లో దోచి తెలంగాణలో తన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏపీలో భూమిపూజ, తెలంగాణలో ధనపూజ చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తెలంగాణలో పౌరుడు, ఏపీకి ముఖ్యమంత్రి అని అన్నారు. ఇప్పటివరకు చంద్రబాబుకు సెక్షన్ 8 ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.