విశాఖ జిల్లాలో విషాదం రేపిన బాణాసంచ గోడౌన్ పేలుడు ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు.
విశాఖ జిల్లాలో విషాదం రేపిన బాణాసంచ గోడౌన్ పేలుడు ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ను ఆదేశించిన సీఎం.. పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనకాపల్లి ఎంపీ, డీఐజీ, విశాఖ ఎస్పీతోపాటు జాయింట్ కలెక్టర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఆదివారం సాయంత్రం జిల్లాలోని ఎస్. రాయవరం మండలం గోకులపాడులోని బాణాసంచా గోడౌన్లో సంభవించిన పేలుడు ఘటనలో ఇప్పటివరకూ ఏడుగురు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో 16నుంచి 18మంది వరకు కూలీలు పనిచేస్తున్నట్టు అక్కడి స్థానికులు చెబుతున్నారు. బాణాసంచా పేలుడు ఘటనలో బాధితులంతా కూలీలేనని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్, నక్కపల్లి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్టు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు చేపట్టకుండా మందుగుండును నిలువ ఉంచడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గౌడన్ యజమానిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.