ఆధార్...ఉద్యోగుల బేజార్
Published Thu, Jan 2 2014 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
నెల్లిమర్ల, న్యూస్లైన్ : జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఆధార్తో ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. ఎన్నాళ్ళో నిరీక్షించిన మీదట ఎట్టకేలకు ప్రభుత్వం ప్రారంభించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు ఆధార్తో లింకు పెట్టడంతో జిల్లాలో సుమారు 16 వేలమంది ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం ఉద్యోగుల్లో సుమారు 75 శాతం మందికి ఆధార్ లేకపోవ డం, ఇప్పటికీ జిల్లాలో ఆధార్ నమోదు కేంద్రా లు ఏర్పాటు చేయకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. దాదాపు అన్ని కుటుంబాల్లోనూ సభ్యులం దరికీ పూర్తిస్థాయిలో ఆధార్కార్డులు లేకపోవడంతో ఏం చేయాలో తోచక ఆందోళన చెందుతున్నారు. ఓవైపు న్యాయస్థా నం ఏ పథకానికీ ఆధార్తో లింకు పెట్టవద్దని తీర్పు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం హెల్త్స్కీమ్ కు ఆధార్ను లింకు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
చివరకు గత్యంతరం లేక జిల్లా కేంద్రంలోని ప్రైవేటు కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్య ఉద్యోగులకు ప్రత్యేకంగా ైవె ద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతనెల 5 నుంచి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకానికి జిల్లాలో సుమారు 16వేల మంది ఉద్యోగులను అర్హులుగా గుర్తించారు. వీరిలో సుమా రు పదివేల మంది ఉపాధ్యాయులే ఉన్నారు. అంతేకాకుండా ఈ ఉద్యోగులపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యులు మరో 50 వేల మంది సైతం ఈ పథకం కిందకు వస్తారు. వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరిస్తే అందరికీ తాత్కాలిక కార్డులు అందించాల్సి ఉంది.
అయితే హెల్త్స్కీమ్కు ఆధార్కార్డులను లింకు పెట్టడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. పథకానికి అర్హులైన వారంతా తమ ఆధార్కార్డును జతచేయాలని ప్రకటించడంతో ఆందోళనకు గురవుతున్నారు. 0 నుంచి 5సంవత్సరాల వరకు వయస్సున్న పిల్లలకు మాత్రం జనన ధ్రువీకరణ పత్రాన్ని జతచేస్తే చాలు. మిగిలిన వారందరికీ తప్పనిసరిగా ఆధార్కార్డులు ఉండాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. వాస్తవానికి మొత్తం ఉద్యోగుల్లో 25 శాతం మందికి మాత్రమే ప్రస్తుతం ఆధార్కార్డులున్నాయి. మిగిలిన 75 శాతం మందికి ఆధార్కార్డులకు నమోదు చేసుకోవాల్సి ఉంది. అయితే ఆధార్ తప్పనిసరి చేయడంతో ఇప్పటికీ కార్డులు లేనివారు ఏంచేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొంతమంది జిల్లాకేంద్రంలోనున్న రెండు ప్రైవేటు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
అయితే వేలసంఖ్యలో క్యూ కట్టడంతో సదరు కేంద్రాల నిర్వాహకులు డబ్బులు గుంజేందుకు తెగబడుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అంతేగాకుండా కేంద్రాలవద్ద కొంతమంది దళారుల అవతారమెత్తి డబ్బులు గంజుతున్నట్లు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ఆధార్నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారు గానీ ఇప్పటికీ ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఆధార్ లేక చాలామంది ఆరోగ్య పథకానికి అనర్హులుగా మారే అవకాశముందని అంటున్నారు. ఓవైపు న్యాయస్థానం దేనికీ ఆధార్ను లింకు పెట్టవద్దని తీర్పు ఇచ్చినా...ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.
Advertisement
Advertisement