నలుగురు ఉపాధ్యాయులకు అవార్డులు | four teachers got best teachers award | Sakshi
Sakshi News home page

నలుగురు ఉపాధ్యాయులకు అవార్డులు

Published Wed, Sep 4 2013 6:46 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM

four teachers got best teachers award

 విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్‌లో జెడ్పీఎస్‌ఎస్ పీజీ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కొమ్ముల బాబు, హన్మకొండలోని కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  స్కూల్‌అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుదర్శనం శ్రీనివాసస్వామి, జఫర్‌ఘడ్ మండలం కూనూరు జెడ్పీఎస్‌ఎస్‌లోని పీజీ హెచ్‌ఎంగా పనిచేస్తూ ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన వై.శోభారాణిలను ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. విద్యాపరంగా, ఇతర సామాజిక సేవలను గుర్తించి వారిని అవార్డులకు ఎంపిక చేశారు. అయితే కొమ్ముల బాబు ప్రభుత్వం నుంచి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపిక కాగా, వై శోభారాణి, ఎ.మల్లారెడ్డి, ఎస్.శ్రీనివాసస్వామిలు నేషనల్ ఫౌండేషన్ టీచర్ వెల్ఫేర్ కింద రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 5న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే వేడుకల్లో వీరికి మెడల్‌తోపాటు *3వేలు పారితోషికం, ప్రశంసాపత్రం అందజేస్తారు.
 
 వేసవిలోనూ ప్రత్యేకంగా తరగతుల నిర్వహణ బాబు ప్రత్యేకత
 జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్‌లో జెడ్పీ ఎస్‌ఎస్ పీజీ హెచ్‌ఎం కొమ్ముల బాబు వేసవిలోనూ ఎస్సెస్సీ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు. దీంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలునాటే కార్యక్రమంలో భాగస్వాములుకావడం, పాఠశాలకు సుమారు *లక్షతో ఫర్నీచర్‌ను స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇప్పించటం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, ఆరోగ్య, పరిశుభ్రత కోసం ర్యాలీలు, మెగాహెల్త్‌క్యాంపును నిర్వహించారు. బాలకార్మికులను బడిలో చేర్పించారు.జిల్లా స్థాయిలో ఉత్తమ పీజీహెచ్‌ఎంగా 2012లో అవార్డు పొందారు. కొమ్ముల బాబు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. తనను రాష్ట్రప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేయటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు
 .
 విద్యతోపాటు విజ్ఞాన కార్యక్రమాల నిర్వహణ
 హన్మకొండలోని కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ స్కూల్‌అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుదర్శనం శ్రీనివాసస్వామి  ఏపీపీఎస్‌సీ ద్వారా 1996లో స్కూల్‌అసిస్టెంట్‌గా నియమాకం అయ్యారు. విద్యను అందించటంతోపాటు 1998లో యూపీఎస్ గుంటూరుపెల్లి పర్వతగిరిలో పాఠశాల స్థల సేకరణ, ప్రహరీగోడ నిర్మాణం చేపట్టారు. ఈయన జన్మభూమి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా పొందారు. 19990-2000 సంవత్సరంలో ఏజెన్సీ ప్రాంతం ఊట్ల మట్టెవాడలో పాఠశాల భవన నిర్మాణానికి కృషిచేశారు. రెసిడెన్షియల్‌స్కూల్‌కు ప్రవేశాలకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 2000-2001లో అక్షర సంక్రాంతి కార్యక్రమంలో 14గ్రూపులకు అక్షరాస్యులుగా తీర్చిదిద్దినందుకు కూడా ప్రశంసలు అందుకున్నారు. 2009లో గూడూరు మండలంలో ఇంచార్జి ఎంఈఓగా కూడా పనిచేశారు. రాష్ట్రస్థాయిలో విజ్ఞానశాస్త్ర మేళాలు నిర్వహించి అప్పటి విద్యాశాఖ మంత్రి ఎన్.రాజ్యలక్ష్మి చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నారు. 2006-2007లో విజ్ఞాన శాస్త్రప్రయోగ దీపికలో చిత్రాలు గీశారు. 2011లో జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.  
 
 డీజీ స్కూల్ విద్యాబోధన శోభారాణి ప్రత్యేకత
 జఫర్‌ఘడ్ మండలం కూనూరు జెడ్పీఎస్‌ఎస్‌లోని పీజీ హెచ్‌ఎంగా పనిచేస్తూ ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన వై.శోభారాణి పాఠశాల అభివృద్ధికి తోడ్పడటంతోపాటు డీజీ స్కూల్‌తరహాలో పలువురి సహకారంతో విద్యను అందిస్తూ మన్ననలు పొందారు. దీంతో ఈమెకు ఈ అవార్డు దక్కింది. ఎన్‌ఆర్‌ఐ తోట రవీందర్ సహకారంతో డీజీ స్కూల్‌గా ప్రొజెక్టర్‌ను ఏర్పాటు చేయించి తమతోటి ఉపాధ్యాయులతో  విద్యాబోధన చేయించారు. నాలుగు తరగతి గదులను కూడా నిర్మాణం చేయించారు.  ఎన్‌ఆర్‌ఐతో *లక్ష నిధులను పాఠశాలపేరుపై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించారు. వచ్చే వడ్డీ రూ.9వేలు ప్రతి ఏడాది టెన్త్‌లో ప్రతిభ చూపిన పేద విద్యార్థులకు పారితోషికంగా అందించేవారు. విద్యాబోధనలో పలుమార్పులు పాటించి ఆ ఉన్నత పాఠశాలలో 47 శాతం ఉన్న ఉత్తీర్ణతను 97శాతం వరకు పెంచగలిగారు. టీసీఎస్ సంస్థ ఆర్థిక సహకారంతో పది కంప్యూటర్‌లను కూడా ఏర్పాటు చేయించారు. బాల వికాసం సహకారంతో ఒక  బోర్‌వెల్‌తోపాటు ఓవర్‌హెడ్‌ట్యాంకును నిర్మించేలా కృషిచేశారు.  
 
 మూతపడిన పాఠశాలను తెరిపించడంలో మల్లారెడ్డి కృషి
 హన్మకొండ మండలం తరాలపెల్లిలో ప్రస్తుతం పీఎస్ హెచ్‌ఎంగా పనిచేస్తున్న అనుమాల మల్లారెడ్డి 1993లో ఉపాధ్యాయుడిగా నియమాకమయ్యారు. ములుగు మండలంలోని రాంగనగర్‌తండాలో 1998లో మూతపడిన పాఠశాలను ఆవాసప్రాంతంలోని విద్యార్థులను 70మందిని ఎన్‌రోల్‌మెంట్ చేరుుంచారు. తరగతి గదుల నిర్మాణానికి కృషిచేశారు. కృత్యమేళాలలో మండల స్థాయి, జిల్లా స్థాయిలో పాల్గొని ప్రథమ బహుమతిని పొందారు. విద్యార్థులకు విద్యతో పాటు క్లాప్స్, క్లిప్ నిర్వహించారు. పాఠశాలకు ఏ గ్రేడ్  సర్టిఫికెట్ వచ్చేలా కృషిచేశారు.  విద్యార్థులు సృజనోత్సవాల్లో క్విజ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో తర్పీదు ఇచ్చారు. అంకితభావంతో పనిచేయటం.. విద్యార్థులకు ప్లేయింగ్ మెథడ్‌లో కూడా విద్యాబోధన చేయడం లాంటి కార్యక్రమాలతో తనకు ఈ అవార్డుదక్కిందని మల్లారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement