
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గంటగంటకూ బలోపేతమవుతోంది. ఇది శనివారం తెల్లవారేలోగా వాయుగుండంగా మారి సాయంత్రానికల్లా బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇది 17వ తేదీ వరకు వాయువ్య దిశగా కదులుతూ.. 18, 20వ తేదీల్లో ఉత్తర ఈశాన్య దిశగా బంగాళాఖాతం వైపు పయనిస్తుందని శుక్రవారం రాత్రి ఐఎండీ వెబ్సైట్లో ప్రకటించింది.
వాయుగుండం బలపడటం, ఇతర ప్రభావాల వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. ‘ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయి. అదే సమయంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి’ అని పేర్కొంది. శనివారం నుంచి 3 రోజుల పాటు బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంటుందని.. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం, ఒక్కోసారి 60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులెవ్వరూ వెళ్లొద్దనీ హెచ్చరించింది.
36 గంటల్లో అండమాన్కు ‘నైరుతి’
రాగల 36 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment