
గుర్లలో తడిచిన వరి పంటను పరిశీలిస్తున్న మజ్జి శ్రీనివాçసరావు
విజయనగరం, గుర్ల: తడిచిన ధాన్యాన్ని అంక్షలు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పెథాయ్ తుఫాన్ వల్ల జిల్లాలోని అన్ని గ్రామాల్లో వరి పంట నీటిలో ఉండిపోవడంతో మండలంలోని గుర్ల, గుజ్జింగివలసలో నీటిలో మునిగిన వరి కుప్పలను ఆయన బుధవారంపరిశీలించారు. నీట మునిగిన వరి చేలును రైతులు కిలారి వెంకటప్పలనాయుడు, కిలారి అప్పారావు, మొయిద అప్పారావు, నిద్దాన గౌరినాయుడులు ఆయనకు చూపించి భోరుమన్నారు. తుఫాన్ వల్ల వరికుప్పలు నీటిలో ఉండిపోయాయని దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్టు అవేదన వ్యక్తం చేసారు. స్పందించిన మజ్జి శ్రీనివాసరావు అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని వారికి హమీ ఇచ్చారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ తడిచిన, రంగు వెలిసిన ధాన్యాన్ని ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా తక్షణమే కొనుగోలు చేయాలని కోరారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా సోనామసూరి, కొనమసూరి రకాలకు చెందని వరి ధాన్యాన్ని కేంద్రాల నిర్వహకులు కొనుగోలు చేయడం లేదని దీని వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్లే పెథాయ్ తుఫాన్కు ధాన్యం బస్తాలు తడిచిపోయాయని తడిచిన ధాన్యానికి ప్రభుత్వం నష్టపరిహరం అందించాలని డిమాండ్ చేశారు. చలికి తట్టుకోలేక జిల్లాలో 990 మూగజీవాలు మరణించాయని వాటికి నష్టపరిహరం అందించి రైతులు ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. గత ఏడాది మొక్కజొన్న పంటకు రాయితీ పరిహరం రూ.200 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు రైతులకు అందించక పోవడం దారుణమన్నారు. రైతుల సమస్యలపై వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఆయన వెంట నాఫెడ్ డైరెక్టర్ కె.వి.సూర్యనారాయణ రాజు, డీసీఎంఎస్ చైర్మన్ శిరువురి వెంకటరమణరాజు, ఆ పార్టీ మండలాధ్యక్షుడు శీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, వరదా ఈశ్వరరావు, రవిబాబు, బోళ్ల మణి, బెల్లాన బంగారునాయుడు, తోట తిరుపతిరావు, కెంగువ మధుసూదనరావు, జమ్ము అప్పలనాయుడు, వెంపడాపు సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment