
బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న మంత్రి అనిల్కుమార్ యాదవ్ తదితరులు
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ సాయమందించారు. వలస కూలీలను తీసుకెళ్లేందుకు తమిళనాడు నుంచి వస్తున్న బస్సు గురువారం మధ్యాహ్నం గుంటూరు రూరల్ మండలం ఓబులునాయుడు పాలెం వద్ద ఎన్హెచ్ 16పై రోడ్డుపక్కన మొక్కలకు నీరు పోస్తున్న ట్రాక్టర్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన బస్సు డ్రైవర్ రాజా (48) తీవ్ర గాయాలతో క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. క్లీనర్ బాబు బస్సులో నుంచి దూకి కిందపడ్డాడు.
అదే సమయంలో విజయవాడ నుంచి నెల్లూరుకు వెళ్తున్న మంత్రి అనిల్కుమార్ యాదవ్ ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ ఆపించారు. తన సిబ్బంది, స్థానికులతో కలిసి బస్సులో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీయించారు. స్థానిక పోలీసులకు, గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్కు సమాచారం అందించారు. తాను స్వయంగా డాక్టర్ కావటంతో సంఘటన స్థలంలో ఇరువురికీ ప్రథమ చికిత్స చేశారు. అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా గంటకు పైగా రోడ్డుపైనే ఉండి Üహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ మృతిచెందగా క్లీనర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment