
‘కాపులను గిల్లుతూ బీసీలకు జోల’
కాకినాడ: కాపు రిజర్వేషన్ల హామీని వచ్చే నెల 7లోగా నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే అదేరోజు కాపు జేఏసీతో సమావేశమవుతామని తెలిపారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు చర్చలకు ఆహ్వానిస్తే తమ తరపున ఐదుగురిని పంపిస్తామన్నారు. వచ్చే 7 నుంచి కాపు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.
కాపు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికే చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నారని అంతకుముందుఆయన ఆరోపించారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే కుట్రలు చేస్తున్నారని, కాపు సోదరులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను చంద్రబాబు గ్రహించాలని హితవు పలికారు. ఓ సీనియర్ రచయిత చెప్పినట్టుగా ‘కాపులను గిల్లుతూ బీసీలను జోల పాడుతున్నారని, మరోసారి బీసీలను గిల్లుతూ కాపులను జోలపాడుతున్నారని’ఎద్దేవా చేశారు.