
నీరు-చెట్టుతో అక్రమ వ్యాపారం
► వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజం
► టీడీపీ నేతల అక్రమాలపై అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు
పట్నంబజారు : టీడీపీ నేతలకు నీరు-చెట్టు కార్యక్రమం వ్యాపారంలా తయారైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో అక్రమంగా చెరువును తవ్వేందుకు అధికార పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అడ్డువచ్చిన గ్రామస్తులు, పెద్దలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై బుధవారం మర్రి రాజశేఖర్, పొన్నూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త రావి వెంకటరమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డిలు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి సమస్యను విన్నవించారు.
అనంతర మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లోని మట్టి, ఇసుకను మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ కార్యకర్తలు అడ్డూ అదుపు లేకుండా అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. దీనిని అడ్డుకున్న గ్రామస్తులపై అక్రమంగా కేసులు పెట్టారని, దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు.
రూ.200 నుంచి 300 కోట్ల వరకు అక్రమార్జన
పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ మాట్లాడుతూ రెడ్ గ్రావెల్ అమ్మకాలు స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్నట్లు చెప్పారు. సుద్దపల్లిలోని చెరువును తవ్వి తే రూ.200 కోట్ల నుంచి 300 కోట్లు వరకూ అక్రమార్జన వస్తుందనే టీడీపీ నాయకులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులతో భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఎంతటి పోరాటాలకైనా వెనుకాడబోదని స్పష్టం చేశారు.