
గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లింలు
నెల్లూరు, కోట: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ ఆరోపించారు. గుంటూరు సభలో ఎనిమిది మంది ముస్లిం యువకుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ కోటలో ముస్లింలు గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులు ఈ ర్యాలీకి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ ఈ నెల 28న గుంటూరులో జరిగిన నారా హమారా.. టీడీపీ హమారా సభ ఒక నాటకమన్నారు. ముస్లింలంతా మా వైపే ఉన్నారని చెప్పుకునేందుకు చంద్రబాబు ఆడించిన నాటకమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కొందరు యువకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతుంటే సహించలేక పోలీసుల చేత అరెస్ట్ చేయించడం ఎంతవరకు సబబన్నారు. చంద్రబాబు చేష్టలు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపే స్వేచ్ఛ ఎవరికైనా ఉందన్నారు. దాన్ని పెద్ద నేరంగా చూపించడం తగదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పులు సరిదిద్దుకుని అరెస్ట్ చేసిన యువకులను విడుదల చేయాలన్నారు.
చంద్రబాబుకు జగన్ భయం
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు యువత పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ముఖ్యమంత్రికి భయం పట్టుకుందని వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొబీన్బాషా ఆరోపించారు. రాష్ట్రంలో యువత అంతా జగన్ వెంటనే నడుస్తుందన్నారు. గుంటూరులో ముస్లిం యువకులను అరెస్ట్ చేయడం ద్వారా చంద్రబాబునాయుడు పెద్ద తప్పిదమే చేశారన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వస్తే అరెస్ట్లు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయని పక్షంలో ఉద్యమిస్తామని తెలిపారు. కోటలో ముస్లిం యువకులు చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీకి ప్రతిఒక్కరూ మద్దతు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లకూరు దశరథరామిరెడ్డి, ముస్లిం హక్కుల పోరాటసమితి జిల్లా అధ్యక్షుడు అన్వర్, ముస్లిం మైనార్టీ నాయకులు మొబీన్బాషా, మాజీ ఉపసర్పంచ్ ఇంతి యాజ్, ఇస్మాయిల్, కరీముల్లా, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పలగాటి సంపత్కుమార్రెడ్డి, వజ్జా చంద్రారెడ్డి, చిల్లకూరు సాయిప్రసాద్రెడ్డి, పల్లెమల్లు శ్రీనివాసులురెడ్డి, గాది భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment