బిల్లు చించడం, తగులబెట్టడం రాజ్యాంగ ద్రోహం | no need assembly acceptance for telangan state | Sakshi
Sakshi News home page

బిల్లు చించడం, తగులబెట్టడం రాజ్యాంగ ద్రోహం

Published Mon, Jan 6 2014 2:23 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

బిల్లు చించడం, తగులబెట్టడం రాజ్యాంగ ద్రోహం - Sakshi

బిల్లు చించడం, తగులబెట్టడం రాజ్యాంగ ద్రోహం

  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
     రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభ  తీర్మానం అక్కర్లేదు
     లోపాల సవరణకు అర్థవంతమైన చర్చ అవసరం
     ఉమ్మడి హైకోర్టు అనేది కుట్రలో భాగమే
 
 సాక్షి, హైదరాబాద్: ‘ఒక పార్టీ అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకొని, బిల్లు రూపొందించాక.. ఆ బిల్లును చించడం, తగులబెట్టడం, కాళ్లకింద వేసి తొక్కడం సంప్రదాయానికి విరుద్ధమే కాక రాజ్యాంగ ద్రోహంగా సుప్రీంకోర్టే స్పష్టం చేసింది’ అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును విభజనతోనే ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. పార్టీలు రాజ్యాంగంచేత గుర్తింబడిన వ్యవస్థలని, అవి గాడితప్పినపుడు, ప్రజలను విస్మరించినపుడు ప్రశ్నించడం మనందరి బాధ్యత అని సుప్రీంకోర్టు పేర్కొందన్నారు. సొంత పార్టీ చెప్పినట్లు కాకుండా ఇతరులతో జతకట్టి ఓటు వేసే వారు, పార్టీకి వెన్నుపోటు పొడిచేవారు కుట్రదారులు అవుతారని.. ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టే తన తీర్పులో విశ్లేషించిందని సుదర్శన్‌రెడ్డి వివరించారు. ఇలాంటి కుట్రదారులు ఇప్పుడు రాజ్యాంగ ఆనవాయితీ గురించి మాట్లాడటం విస్మయం కలిగిస్తోందన్నారు.
 
 తెలంగాణ ఏర్పాటుకు శాసనసభ తీర్మానం అక్కర్లేదని, కేంద్రం చేసిన బిల్లుపై అభిప్రాయాలు మాత్రమే పంపించాలని, తదుపరి ప్రక్రియను కేంద్రం చూసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర శాసనసభ కాదంటే తెలంగాణ ఆగదని, బిల్లులో లోపాలపై చర్చించాల్సిన అవసరం తెలంగాణ ప్రజాప్రతినిధులకే ఎక్కువగా ఉందన్నారు. న్యాయవ్యవస్థపై పట్టుపోతే తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందన్న భయంతో ఉమ్మడి హైకోర్టు డిమాండ్‌ను కుట్రదారులు తెరపైకి తెచ్చారన్నారు. 1956 నుంచే హైకోర్టులో వివక్ష మొదలైందని, ఏడుగురు జడ్జిలను జూనియర్లుగా మార్చి, ప్రధాన న్యాయమూర్తులు కాకుండా, సుప్రీంకోర్టుకు వెళ్లకుండా కుట్ర చేశారని హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములు పేర్కొన్నారు. తెలంగాణ జిల్లాల్లోని కోర్టుల్లో 20శాతం కంటే ఎక్కువగా స్థానికేతర ఉద్యోగులు ఉన్నారన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా జడ్జీలు, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీల్లో తెలంగాణకు సరైన ప్రాతినిధ్యం లేదన్నారు. హైకోర్టులో జడ్జీల నుంచి న్యాయవాదుల వరకు వివక్ష కొనసాగుతోందని, మానసికంగావిభజన ఏర్పడిందన్నారు. ఇలాంటి తరుణంలో వేర్వేరు హైకోర్టులు ఉండటమే అందరికి మంచిదన్నారు.
 
  రాష్ట్రం ఏర్పడితే సంపూర్ణ అధికారం ఉండాలని, లేదంటే అక్కడి ప్రజలకు న్యాయం చేయలేరని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు క్రియాశీలంగా వ్యవహరించారన్నారు. బిల్లులో సవరణలే ముఖ్యమని, ఇందుకోసం అందరూ కృషి చేయాలన్నారు. మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, హైకోర్టు మాజీ ఏజీ ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ జాఫ్రీ, హైకోర్టు న్యాయవాది రఘునాథ్ మాట్లాడారు. న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ తెలంగాణలోని అన్ని బార్ అసోసియేషన్లు చేసిన తీర్మానాలను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను, డైరీని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు గోవర్ధన్‌రెడ్డి, రవికుమార్, తిరుపతివర్మ, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement