పార్కు కాదు.. పాఠశాలే!
Published Thu, Aug 22 2013 2:40 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
తిప్పర్తి, న్యూస్లైన్:విద్యార్థులకు విద్యాబోధనతో పాటు పాఠశాలలో ఆహ్లాదరకమైన వాతావరణం కల్పించేందుకు నడుం బిగించాడు తిప్పర్తి మండలం మాడ్గులపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చాలనే ఉద్ధేశంతోనే విద్యను సులభంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాభోదనను భోదిస్తున్నారు. మాడ్గులపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా 2009లో బాధ్యతలు చేపట్టాడు జాకటి వెంకటయ్య. అప్పట్లో పాఠశాల ఆవరణ విశాలంగా ఉన్నా చెట్లు మాత్రం లేకుండా ఉండడంతో ఆయన పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల పెంపకాన్ని చేపట్టాలనే ఆలోచనతో దాతల కోసం వేట మొదలు పెట్టారు. అందులో ముఖ్యంగా పూర్వ విద్యార్థులకు పాఠశాల అభివృద్ధి కోసం భాగస్వామ్యులను చేశారు.
దీంతో పాఠశాల ఆవరణలో చెట్లు పెంచే బాధ్యతలను తన భుజాలపై వేసుకుని నిత్యం చెట్ల సంరక్షణను చేస్తూ పాఠశాలను మండలంలోనే ఆదర్శ పాఠశాలను తీర్చిదిద్దేందుకు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజుంరాజుతో కలిసి నిర్విరామంగా కృషి చేస్తున్నాడు. దీనికి తోడు పాఠశాలలో విద్యార్థులకు సులభంగా విద్య అబ్బడానికి టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ సాయంతో బోధన చేపట్టారు. అలాగే పాఠశాల కార్యాలయంలో కూడా జాతీయ నాయకుల ఫొటోలతో పాటు వివిధ రకాల స్టడీ మెటిరియల్ను గోడలపై ఉంచారు. వీటి కోసం గ్రామస్తులతో పాటు పూర్వ విద్యార్థుల సహకారాన్ని ఆయన ఉపయోగించుకున్నారు.
చెట్లతో పాటు నీతి వాక్యాలు
పాఠశాల ఆవరణలో నాటిన చెట్లు పెరిగి పెద్దయ్యి పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. దీంతో విద్యతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం పార్కు వలే రూపొందించి చెట్ల మద్యలో విద్యకు సంబంధించిన నీతి వాక్యాల బోర్డులు ఏర్పాటు చేయించారు. అలాగే విద్యార్థులు కూర్చోవడానికి పాఠశాల ఆవరణలో సిమెంట్ బెంచీలు కూడా ఏర్పాటు చేయించారు.
పాఠశాల హెచ్ఎంకు జిల్లాస్థాయి అవార్డు
పాఠశాల అభివృద్ధి కోసం అహర్నిషలు శ్రమిస్తున్న జాకటి వెంకటయ్యకు 2010లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. స్వగ్రామమైన మాడ్గులపల్లిలో పాఠశాలకు ఎనలేని సేవలు చేస్తున్న ఆయన గ్రామ యువతకు కూడా ‘‘యువత - భవిత’’ అనే అంశంపై ఆరోగ్యం, యోగా అనే సదస్సులను ఏర్పాటు చేశారు. మండలంలోని అనేక పాఠశాలల్లో విద్యార్థులకు ఆయన ఫ్లోరోసిస్పై అవగాహన సదస్సులు నిర్వహించారు.
Advertisement
Advertisement